Friday 20 April 2012

మీరే హైదరాబాదును వదిలేసుకోవచ్చుగా?


"మీరే హైదరాబాదును వదిలేసుకోవచ్చుగా?" ఇది తెలంగాణవాదులకు ఓ సమైక్యవాది ప్రశ్న. తెలంగాణ నడిబొడ్డూన ఉన్న హైదరాబాదును వదిలేసుకుంటే ఈయన హెలికాప్తర్లో హైదరాబాదుకు రోజూ వస్తాడట. ఇలాంటీ అహంకారులకు దిమ్మతిరిగిపోయేట్లు తయారుచేసిన ఒక చక్కటి వీడియో.


విడిపోతే నష్టం ఎవరికి?


పదేళ్ళనుండీ మలిదశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నపుడూ, రాష్ట్రంలో అన్ని పార్టీలు తెలంగాణను మానిఫెస్టోల్లో పెట్టి రాజకీయం చేస్తున్నప్పుడూ ఏనాడూ పట్టించుకోని సీమాంధ్రులు డిసెంబర్ 9 చిదంబరం ప్రకటన తరువాత ఏదో కొంపలు మునిగిపోయినట్లు సమైక్యాంధ్ర ఉద్యమాన్ని లేవదీశారు. ఈఉద్యమం నాయకులు తయారుచేసిన కృత్రిమ ఉద్యమం అయినప్పటికీ ఈఉద్యమం ద్వారా మీడియా సహాయంతో వీరు తెలంగాణ వస్తే ఆంధ్రా ప్రజలకు నష్టం వాటిల్లుతుంది, హైదరాబాదునుండి తరిమేస్తారు, క్రిష్ణా గోదావరి నీల్లు రావు లాంటి భయాందోళనలు సృష్టించడంలో కృతకృత్యులయ్యారు.  అసలింతకూ రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలో నష్టపొయ్యేదెవరో, లాభపడేదెవరో విశ్లేషించాల్సిన అవసరం ఉన్నది.

1) ప్రస్తుతం మన రాష్ట్రంలో అధికారం ఎప్పుడూ రెండు అగ్రకులాల చేతుల్లోనే ఉంటుంది. ఒకసారి కమ్మలకు అధికారం వస్తే మరోసారి రాయలసీమ రెడ్లకు వస్తుంది. రాష్ట్రజనాభాలో వీరిశాతం కొద్దిదయినప్పటికీ అధికారం వీరిచేతిలో ఉండడానికి కారణం పెద్దరాష్ట్రంలో అధికారం రావాలంటే కావాల్సిన ధనబలం, మీడియా బలం వీరిదగ్గర ఉంది.  రాష్ట్రం విడిపోతే సీమాంధ్రలోని దళితులు, బీసీలు అధికారానికి దగ్గరవుతారు. ఈకారణం వల్లే సీమాంధ్రలోని దళిత మహాసభ, బీసీలు విభజనకు మద్దతు ఇస్తున్నారు.

2) సమైక్యరాష్ట్రంలో తెలంగాణలాగే ఉత్తరాంధ్ర కూడా నిర్లక్ష్యానికి గురి అయ్యింది. రాష్ట్ర విభజన జరిగితే చిన్న రాష్ట్రంలో ఉత్తరాంధ్ర నాయకులు తమ డిమాండ్లను గట్టిగా వినిపించి తమప్రాంతానికి ఎక్కువ నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది.

3) సీమాంధ్రలోని మరో ప్రముఖ సామాజికవర్గమయిన కాపులు సమైక్యరాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఎప్పటినుంచో కలలు కంటున్నా వారికలలు నిజం కావడంలేదు. విభజన జరిగితే వీరు సీమాంధ్రలో బలమయిన వర్గంగా తయారవుతారు. అప్పుడు వీరికి అధికారం రావడం చాలా సులభం.

4) ఓడరేవు, పరిశ్రమలూ కలిగిన విశాఖ అత్యంత వేగంగా అభివృద్ధి చెంది త్వరలో దేశంలో పెద్ద నగరంగా ఎదగగలదు.

5) కొత్త రాజధాని ఎక్కడయితే అక్కడ రాజధానివలన అబివృద్ధి జరిగి ఆప్రాంత ప్రజలకు మేలు జరుగుతుంది.

6) విడిపోతే ఇప్పుడు ఉన్న ప్రభుత్వోద్యోగులు రెండు రాష్ట్రాలలో విడిపోయినప్పటికీ కొత్త ఉద్యోగాలు సీమాంధ్రలో ఎక్కువగా అవసరం అవుతాయి. హైదరాబాదులో ఉండే ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు ఎక్కువమంది అక్కడే ఉండడానికి ఇష్టపడతారు కనుక వారి స్థానాలవల్ల ఆంధ్రాప్రాంత యువకులు ఎక్కువలబ్ది పొందురారు.

ఈవిధంగా సీమాంధ్రలో సుమారు ఎనభైఅయిదు శాతం దాకా విభజన వలన లాభపడతారు. కానీ నష్టపోయే కొద్దిశాతం మంది మొత్తం అందరికీ విభజనవలన నష్టం కలుగుతుందే అనే ఒక భయాందోళన క్రియేట్ చేశారు. ఇంతకూ ఈనష్టపొయే కొద్దిమంది ఎవరు?

1) లగడపాటి, రాయపాటి, కావూరు, సుబ్బరామిరెడ్డి, టీజీ వెంకటేశ్ లాంటి సీమాంధ్ర నాయకులు సివిల్ కాంట్రాక్టు వ్యాపారాలు చేస్తూ అధికారం ద్వారా సమైక్యరాష్ట్రంలో ప్రభుత్వ కాంట్రాక్టులు కొట్టేస్తున్నారు. విభజన జరిగితే వీరు ఇక సీమాంధ్ర ప్రాంతంలోని కాంట్రాక్టులకే పరిమితం కావాల్సి వస్తుంది.

2) రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వ్యాపారంలో ఉన్నవారు విభజన వలన తమ వ్యాపారాన్ని రెండుగా విడగొట్టి రెండు ప్రాంతాల్లో రెండు సంస్థలుగా నడపడమో లేక ఏదో ఒక ప్రాంతానికి పరిమితం కావడమో చేయాల్సివస్తుంది. వీరి వ్యాపారాలకు విభజన దెబ్బ తీవ్రంగా ఉంటుంది.

3) అధికారాన్ని అడ్డుపెట్టుకుని హైదరాబాదులో భూకబ్జాలకు పాల్పడ్డ సీమాంధ్ర నాయకులకు పెద్ద దెబ్బే తగులుతుంది. విభజన తరువాత హైదరాబాద్ పరాయి రాష్ట్రంలో భాగమవుతుంది. సొంతరాష్ట్రంలో ఉన్న అధికారసౌలభ్యం అక్కడ ఉండదు.

4) సమైక్య రాష్ట్రంలో రాజకీయ, మీడియా, సినీఫీల్డ్, వ్యాపార రంగాల్లో ముందుండి క్రిష్ణ కింద పొలాలు అధికంగా కలిగిన కమ్మసామాజిక వర్గం ప్రస్తుతం సమైక్యరాష్ట్రంలో విపరీతంగా లాభపడుతుంది. విభజన వల్ల వీరికి గట్టి దెబ్బ తగులుతుంది. వీరి వ్యాపారాలు ఒక రాష్ట్రంలో, వీరి జనాభా మరొక రాష్ట్రంలో మిగిలిపోయి రెండు రాష్ట్రాల్లో వీరు అధికారానికి దూరమవుతారు.

5) రాయలసీమలో ఫాక్షన్ రాజకీయాలు చేసే వర్గానికి విభజన వలన దెబ్బ తగులుతుంది. చిన్నరాష్ట్రంలో బడుగులు అధికారానికి దగ్గరయితే వీరి పెద్దరికం తగ్గిపోయి అధికారం దూరం కావొచ్చు.

మొత్తంగా విభజన వలన సీమాంధ్రలో మెజారిటీ లాభపడితే కొద్దిశాతం మందికి మాత్రం నష్టం జరుగుతుంది. నిజానికి దీన్ని నష్టం అనడం కూడా సరికారు. మితిమీరిన లాభం అనుభవిస్తున్న వారికి కొంత లాభం తగ్గితే అది నష్టం కాదు. అయినా మనిషి ఆశకు అంతులేదుకదా, వీరు దాన్ని నష్టం కింద లెక్కేసుకుని తమలాభం తగ్గకూడదనే దురుద్దేశంతో రాష్ట్ర విభజనకు అడ్డుపడుతూ విభజన జరిగితే సీమాంధ్రలో అందరికీ నష్టం అన్న అభిప్రాయాన్ని కలుగజేస్తున్నారు. ఇకనయినా సీమాంధ్రలోని మిగతా ఎనభై ఐదు శాతం మంది తమపై జరుగుతున్న కుట్రను తెలుసుకుని దాన్నుంచి బయటపడితే తెలంగాణలో, సీమాంధ్రలో మెజారిటీకి లాభం జరిగేలా విడిపోవచ్చు.

చివరగా...విభజనను అడ్డుకునేవారు తెలుగు జాతి విడిపోగూడదు, తెలుగు జాతి ఐక్యత లాంటి కబుర్లెన్నో చెబుతారు, కానీ వారి అసలు ఉద్దేషం  విభజన వలన వారి లాభాలు తగ్గిపోవడమే. లేకపోతే తెలంగాణకు న్యాయం జరుగుతుందనగానే జై ఆంధ్ర ఉద్యమాన్ని లేవదీసినవారికి తెలుగుజాతి ఐక్యతపై ఒక్కసారి అంతప్రేమ ఎలాపుట్టుకొస్తుంది? సీమాంధ్ర సామాన్య ప్రజలారా, ఆలోచించండి.

Monday 16 April 2012

ఇది ఫుడ్ ఫాసిజం!



ఉస్మానియాలో దళిత,బహుజన విద్యార్థి సంఘాలు తలపెట్టిన బీఫ్ ఫెస్టివల్, ఏబీవీపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తతకు దారితీసింది. ఇరువర్గాలూ ఘర్షణ పడగా పోలీసులు లాఠీచార్జీ, భాష్పవాయుప్రయోగం చేయాల్సివచ్చింది. గతసంవత్సరం కూడా దళిత విద్యార్థులు బీఫ్ ఫెస్టివల్ చేసినప్పుడు రైట్‌వింగ్ వారు అడ్డుకుని ఆహారంలో మూత్రవిసర్జన జరిపినట్లు సమాచారం. కాగా ఈసారి దలితులు అప్రమత్తంగా ఉన్నప్పటికీ వారి ఫెస్టివల్ ఉద్రిక్తతుకు దారితీసింది.

దళితులు ఎద్దుమాంసం ఒక డెలికసీ. ఎద్దు, దున్నపోతు మాంసాలు వారు ఇష్టంగా తింటారు. వందల సంవత్సరాలనుంచీ ఇతర సమాజానికి దూరంగా విసిరివేయబడ్డట్టు బతుకు కొనసాగించిన దలితులు ఊర్లో ఎవరింట్లోనైనా గొడ్లు చనిపోతే వాటిని తీసుకెల్లి కోసి మాంసం తిని చర్మంతో చెప్పులు తయారుచేసేవారు. మున్సిపాలిటీ లాంటి వ్యవస్థలు లేని ఆకాలంలో వీరు చచ్చిన గొడ్లను తీసుకెల్లి మిగతా సమాజానికి చచ్చిన గొడ్లు కుల్లిపొయి వ్యాధులు వ్యాపించకుండా సేవ చేశారు. ఇప్పుడు వారు గొడ్డుమాంసం తినడం ద్వారా తమ మనోభిప్రాయాలు దెబ్బతింటున్నాయని రైట్ వింగ్ అభిప్రాయం. ఈమొత్తం పరిణామం అనేక ప్రశ్నలకు తావిస్తుంది.

గొడ్డు మాంసం తినడాన్ని అడ్డుకుంటున్న వారిలో అనేకులు గొర్రె, మేక మాంసం తినేవారే. రేపెవరయినా వచ్చి గొర్రె, మేక వారికి తల్లి లాంటివి, దేవతలతో సమానం కనుక ఎవరయినా వాటి మాంసం తింటే తమ మనోభిప్రాయాలు దెబ్బతింటాయి అని చెబితే ఎంతమంది  తినడం మానేస్తారు? ఇప్పుడు అడ్డుకున్న వారిలో అనేకులు రేప్పొద్దున విదేశాలకెల్తారు. అక్కడ ఆఫీసు క్యాంటీనులో తమపక్కనే కూర్చొని తెల్లొల్లు గొడ్డుమాంసం తింటుంటే వీల్లమనోభావాలు దెబ్బ తినవా? దెబ్బతింటే తెల్లొల్లకు గొడ్డుమాంసం తినొద్దని వీరు అడ్డు చెబుతారా?

అంటే గొడ్డుమాంసం తినే దళితులు తమకంటే తక్కువవారు కనుక వారి హక్కులకు భంగం కలిగించొచ్చు.ఏమయినా అంటే మామనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పొచ్చు. తెల్లోడు మనకన్న బలవంతుడు, ఎక్కువమాట్లాడితే ఎగిరి తన్నుతాడు కనుక తెల్లోడు పక్కన కూర్చొని గొడ్డుమాంసం లాగిస్తున్నా నోర్మూసుకుని ఊర్కుంటారు. మేకని తింటే తమ మనోభావాలు దెబ్బతింటాయని ఎవరైనా చెబితే ముందు ఎదుటివారి బలం ఎంత అని చూసి, బలవంతుడయితే ఆపేస్తారు, బలహీనుడయితే పట్టించుకోరన్నమాట!!

అసలు దళితులు బీఫ్ ఫెస్టివల్లో తినేది, మన రాష్ట్రంలో దొరికేది ఆవు మాంసం కాదు, ఎద్దు, బర్రె, లేదా దున్నపోతు మాంసం. తినేది ఆవు మాంసం కానేకానప్పుడు ఎవరి మనోభావాలు మాత్రం ఎందుకు గాయపడాలి? ఎద్దు మాంసంతో బూట్లు చేస్తే చక్కగా కొనుక్కుని తొడుక్కున్నప్పుడు ఎద్దుమాంసం తింటే మనోభావాలు ఎందుకు దెబ్బతినాలి? వీల్లనెవ్వరూ తినమనలేదే? పక్కవారు తింటూంటే ఎవరికి మాత్రం ఏం నష్టం? అసలు గొడ్డు మాంసం తినగూడదు, మేక, గొర్రెలను తినొచ్చని ఏమతగ్రంధం చెప్పింది?

అసలు నిజానికి హిందువులు గొడ్డుమాంసం తినకపోవడానికి మతంతో సంబంధం లేదు. వ్యవసాయ ప్రధానమయిన దేశంలో పశువులు సాధారనంగా ప్రజలకు, ముఖ్యంగా రైతులకు పెంపుడు జంతువులలాంటివి. పెంపుడు జంతువులను తినడానికి మనసొప్పదు కనుక గొడ్డుమాంసం తినడం మానేశారు అనేది ఒక థీరీ కాగా పశుసంపద తగ్గిపోగూడదనే ఉద్దేషంతో గొడ్డుమాంసం తినడం మానేశారనేది మరొక వాదన. ఇప్పుడు కొత్తగా ఆరెస్సెస్ దీన్ని మతానికి లింకు పెట్టి తినొద్దని శాసిస్తే వేలసంవత్సరాలనుండి గొడ్డుమాంసాన్ని ఇష్టంగా తింటున్న దళితులు ఇప్పుడెందుకు మానెయ్యాలి?

బీజేపీ, ఆరెస్సెస్ల ఫాసిస్టు పోకడలవల్ల తెలంగాణలో ఎప్పుడో ఈపార్టీకి ప్రజలు పాతరేశారు. ఇప్పుడు తెలంగాణవాదంవల్ల మహబూబ్‌నగర్లో గెలిచిన బీజేపీ ఇది తమ సొంతబలమనుకుని మల్లీ ఫాసిస్టు పోకడలకు పోతే నష్టపోయేది వీరే. మతవిశ్వాసాలు, భొజనపు అలవాట్లూ మనుషుల వ్యక్తిగత విషయాలు, వీటిపై ఎవ్వరూ మరొకరిని శాసించలేరని బీజేపీ ఇకనయినా తెలుసుకుంటే మంచిది.




Sunday 15 April 2012

జయ జయహే తెలంగాణ



prayanam‘ఉపాధ్యాయ సమ్మె వాయిదా. నేటి నుండి మోగనున్న బడిగంటలు.’
పేపర్లలో ఈ వార్తను హెడ్డింగుల్లో చూసిన నళిని మరింత ఢీలా పడింది.
నిజానికి బడికి వెళ్లడం అంటే ఎంతో ఉత్సాహం నళినికి. కానీ ఇయ్యాల, ఈ స్థితిలో వెళ్లడం అంటే ఎందుకో మనసొప్పడం లేదు.
దబదబా వంట చేసింది గని ఏడున్నయో... టిఫిన్ బాక్స్‌లు దొరుకుత లేవు.
సమ్మె జెయ్యవట్టి నెల రోజులాయె మరి.
తెలంగాణ అటో ఇటో తేలకనే పాయె!
ఆఖరికి సమ్మె బంద్ వెట్టిరి. తెలంగాణ రాష్ట్రం ఇవ్వక పోయిరి.
మనసునిండా ఇవే ఆలోచనలు....అందుకే అన్యమనస్కంగా పనిచేస్తోంది నళిని.
పేపర్లు ఆడ పారేసి ‘బడికి వెళ్లాలె...’ అనుకుంటూ, ఆ ఆలోచనలతోనే భర్త వివేక్‌కు ప్లేట్‌లో ఇడ్లీ పెట్టింది.
‘‘అల్లం చట్నీలో బెల్లం తక్కువయింది’’ అనుకుంటనే తింటున్నడు వివేక్. తింటూ, ‘‘ఏమాయె నళినీ! ఈసారి తప్పకుంట తెలంగాణ వస్తదంటివి కదా’’ అన్నడు వివేక్.
‘‘అవును అనుకుంటిని’’ బాధగానే చెప్పింది నళిని.
‘‘ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని చిదంబరం అనంగానే ఆంధ్ర నాయకులు ఏకమై రాజీనామాలు జేసిరి. మన నాయకులు ఏకమై ప్రజలతో పోరాటం చేస్తారనుకున్న. వాళ్లిట్ల చతికిల బడుతరని నేనేమన్న కల గంటినా’’ అన్నది. అనుకుంటనే, బోళ్లన్నీ అటూ ఇటూ జరిపి పెరుగు డబ్బా, కూర డబ్బా దొరకవట్టింది. దబదబా ఇంత అన్నం కూరల్ని బాక్సుల్లో పెట్టుకుని, బ్యాగు భుజానికి తగిలించుకుని భగత్‌నగర్‌లో ఆటో ఎక్కి కల్పన హోటల్ దగ్గర దిగింది నళిని.
మారుమూల గ్రామాలకు వెళ్ళే ఆటోలు అక్కడే చక్కర్లు కొడతయి.

నళిని రోజూ పోయే ఆటోను గుర్తు పట్టాలంటే ముందు డ్రైవర్‌ను, ప్రయాణీకులను చూడాలె.
కానీ, ఆ అవసరం లేకుండనే, ఓ ఆటోల్నుంచి రమ్మని తన దోస్తులు చెయ్యి ఊపుతునే ఉన్నరు.
అవును మరి. ఆ ఆటోలో ఉన్నవాళ్లు దాదాపూ దోస్తులే. దాదాపూ అందరూ రోజూ తనతో ప్రయాణం చేసేటోళ్ళే. ఆత్మీయతను పంచేటోళ్ళే.
రూపాయికి కిలో బియ్యం, స్వశక్తి రుణాలు, వృద్ధాప్య పెన్షన్‌లు, తెలంగాణ ముచ్చట్లు, బంద్‌లు, టీవీ వార్తల్లోని అంశాలు...ఇవే వాళ్ల చర్చల్లోని రోజువారీ ముఖ్యాంశాలు.
‘‘జరుగుండ్రి జరుగుండ్రి! మా వూరి మేడమ్ కూసుంటది’’ కాంతమ్మ అందరిని సెల్పింది.
భూదమ్మ, భారతి, స్వరూప, కనకయ్య, కాంతమ్మ ఎప్పటిలాగే ఆటోలో కూచుని ఉన్నరు.
ఆటో కమాన్ దాటింది.
పాల డబ్బాలు గల గల శబ్దం చేస్తున్నయ్.
డబ్బాలు అనుకోకుండా కాళ్లకు తాకితే మొక్కుతరు. అవును మరి. వాళ్ల ఇసిలన్నీ దేవుళ్ల లెక్క సూసుకుంటరు.

భూదమ్మయితే ఖాళీ పాల సీసాల గంపను కింద పెట్టేది కాదు. పసిపిలగాని లెక్క తొడమీద పెట్టుకుంటది.
ఆటో కోతి రాంపూర్ పెట్రోల్ బంక్ దగ్గర ఆగింది.
లింగాపూర్ మాజీ సర్పంచ్ బాలరాజు ఎక్కిండు. వెంట ఆయన వియ్యంకుడు లింగస్వామి ఉన్నడు.
‘‘మేడం నెల రోజులాయె...కనపడక. ఇవాల్టి నుండి బడి షురువైన అడిగిండు బాలరాజు.
మళ్లీ మనస్సు కలుక్కుమన్నది.
ఆయన ఊకోలేదు. ఇంకా ఇట్లడిగిండు... ‘‘తెలంగాణ ఏమైనట్టు? గింతమంది గిన్ని రకాలుగా బందు సప్పుడు జేత్తలేరు. ఇత్తరనక పోయిరి. ఇయ్యమనక పోయిరి.’’ తనలో తాను మాట్లాడుకున్నట్టే అంటున్నడు బాలరాజు.

‘‘కుల సంఘపోల్లు, ఆటోలోల్లు, మహిళాక్షిగూపులు, దుకాణాదారులు, ఉద్యోగస్తులు, బస్సు కండక్టర్లు, డ్రైవర్లు, కార్మికసంఘాలు, కరెంటోళ్లు, విద్యార్థులు, పిల్లలు, పెద్దలు ముసలోల్లు తీరొక్కలు రోడ్డెక్కిరి.....’’ నోటికి కొంగు అడ్డం పెట్టుకునే అట్లే అంటున్నది కాంతమ్మ.
తలా ఒక మాట అంటనే ఉన్నరు.
ఆ మాటలకు ఇంకొకలు స్పందనగా ఉంకో మాట జోడిస్తున్నరు.
‘‘అయినా...గా సోనియమ్మకు తెలుగే రాదట కదా? మన తెలంగాణ బతుకుల సంగతి ఆమెకు ఏం తెలుస్తది’’ అన్నది భూదమ్మ.
‘‘ సోనియమ్మకు తెల్వకపోతె పోనీగని..మనం ఓట్లేసి గెలిపిచ్చుకున్నోళ్లకు ఎందుకు తెల్త లేదవ్వా?’’ అనవట్టింది భారతి.
‘‘రోజు పేపర్ల, టీవి వార్తలల్ల సూత్తనే ఉన్నం. నాయకుల ముచ్చట జూడబోతే ఎన్ని నెలలయినా తెలంగాణ ఇచ్చేటట్లు కనబడత లేదు.
కమీటిలు అన్నరు. ఇగొచ్చె తెలంగాణ, అగొచ్చె తెలంగాణ అన్నరు. రేపే తెలంగాణ తీర్మానం అన్నరు. తెలంగాణ కోసమే మీటింగ్‌లన్నీ అన్నట్టు జేసిరి. ఇప్పుడేమో తెలంగాణ ముచ్చటే పక్కకు పెట్టిరి. మనం ఇక్కడ సమ్మె జేస్తాంటే ‘ఢిల్లీల ఊదు కాల్తలేదు. పీరి లేత్త లేదు’’ చెప్పింది సత్తెమ్మ.
నళిని మౌనంగ వింటున్నది.

తలా ఒక తీరుగా మాట్లాడుతుండగా, ఆటోలో చెక్కమీద కూసున్న కనకయ్య మాత్రం బీరి పోయి కనిపించిండు. బొక్కకు చెటాక్ మాంసం లేదు. కనుగుడ్లు లోపలకు పోయినయి. రోడ్డు దిక్కే సూత్తాండు.‘‘ఏందే నాయనా సప్పుడు జేత్తలేవు?’’ అన్నది స్వరూప.
‘‘తమ్ముడు మస్కట్ పోయిండు బిడ్డా! నెల రోజులాయె. జాడలేదు. పత్తా లేదు. ఫోన్‌ల మాట్లాడలేదు. నా మనమరాలు వాళ్ల బాపును ఇడ్చిపెట్టి ఉండకపోవు. బజారు దిక్కు చూపిచ్చుకుంట పులుకు పులుకున ఏడ్పు....’’ అని చెప్పి కండ్లళ్ల నీళ్లు తుడ్సుకున్నడు. క్షణం తర్వాత గొంతు పెగుల్చుకుని, ‘‘...ఏసిన రెండు బోర్లు గూడ ఫెయిలయినయ్. అప్పుల పాలైతిమి. పంటలు లేవు. బతుకు దెరువు లేదు....మన నీళ్లు మనకు గాకుంట చేసినోళ్లను నడి బజార్ల నిలబెట్టాలె బిడ్డా!’’ అంటూ కనకయ్య ఎత చెప్పిండు. అంత నిస్సహాయతలోనూ పోరాట మార్గమూ చెప్పిండు.
ఆటో అల్గునూర్ క్రాసింగ్ దగ్గర ఆగింది. బక్క పల్చటి పిలగాడు ఎక్కిండు. ఎరుపు వన్నె. చూసిన మొకమే. వెనుకకు తిరిగి చూస్తూ ‘‘బాగున్నారా మేడమ్’’ అన్నడు.
‘‘ఆఁ....సతీషా......?’’
‘‘అవును మేడమ్ సతీష్‌నే...’’
‘‘ఏం చేస్తున్నవ్ బాబూ? అమ్మనాన బాగున్నరా? నాన రైస్ మిల్లుల్నే పనిచేస్తున్నడా?’’ అడిగింది నళిని.
‘‘హైవూదాబాద్‌లో ఉంటున్న మేడమ్. ఎం.యస్.సి. అయిపోయింది. గ్రూప్సు ప్రిపేర్ అవుతున్న.’’
‘‘ పట్టుదలతో చదువు. మంచి జాబ్ సంపాదించుకో...’’ చెప్పింది నళిని,
‘‘ ఆ...ఏం జాబ్‌లు మేడమ్. ఎంత చదివినా ఏం లాభం లేదు మేడమ్’’ అన్నడు. ‘‘మొన్న జరిగిన గ్రూపు వన్ పరీక్ష రాసిన. రాత పరీక్షలో మంచి మార్కులు వచ్చినయ్. జాబ్ గ్యారంటీ అని మిత్రులు చెప్పిండ్రు. ఉత్సాహంతో ఇంటర్వ్యూకు గూడ పోయిన. అడిగిన అన్ని ప్రశ్నలకూ జవాబులు చెప్పిన. రెండు రోజుల తర్వాత లిస్టు పెట్టిండ్రు. అండ్ల నా పేరు లేదు మేడమ్...రాత పరీక్షలో నా కంటే తక్కువ మార్కులు వచ్చినోళ్ల పేర్లు ఉన్నయ్’’ బాధతో చెప్పిండు సతీష్.
ఆటోలో అందరూ సతీష్ చెప్పేది వింటున్నరు.
‘‘మన తెలంగాణ మంత్రులు సెక్రె అటెండర్ల లెక్క...గంతే. ఆంధ్రా మంత్రులేమో బంధువులకు ఉద్కోగాలిప్పిచ్చుకునుడు. ఇంటర్వ్యూల ఎక్కువ మార్కులు వేయించుకునుడు...ఉన్న ఉద్యోగాలన్నీ దొబ్బుడు...గిదే పనాయె.. ’’ అప్పటిదాకా మౌనంగా ఉన్న సర్పంచ్ వియ్యంకుడు అన్నడు. ఆ మాటకు ‘‘నిజమే అన్నా...’’ అన్నడు సతీష్.
ఇంతల ఆటో మానకొండూర్‌ల ఆగింది. సతీష్ నమస్కారం చెప్తూ దిగి పోయిండు.
ఆటో గతుకుల రోడ్ మీద ఎత్తేసుకుంటూ స్పీడ్‌గా పోతూనే ఉన్నది.
లోపల ఉన్న వాళ్లు కొండపల్లి బొమ్మలు ఊగినట్లుగా కదులుతున్నరు.

‘‘నాయకులందరూ ఒక్కటే, నీ పార్టీ లేదు. నా పార్టీ లేదు. రాత్రికి రాత్రి మొఖం చూడద్దు అన్నట్టు తిట్టుకుంటరు. తెల్లార్తె ఒక్కటైతరు. చావుల కాడ, పెండ్లిల్ల కాడ పక్కపక్కనే కూసుంటరు. నిజంగ మనమందరం నాయకులతోనే మోసపోతున్నం. మనం ఓట్లేసి గెలిపించినోళ్లే తెలంగాణకు అడ్డు. నాయకులందరూ మనతో కలిసి రాకపాయే....’’ విచారంగా అన్నడు బాలరాజు.
‘‘ఇగో ఇంటాన్నావా నోయ్ లింగస్వామి! తెలంగాణకు అడ్డుపడ్డ నాయకులను ఊళ్ళె అడుగు నియ్యద్దు. కుర్చీలు ఎయ్యద్దు. దండ లెయ్యద్దు’’ వియ్యంకుడికి బాలరాజు హెచ్చరికగా చెప్తనే ఉన్నడు.
ఆటోలో కూసున్నోళ్లంతా ఆ మాటల్ని వింటనే ఉన్నరు.

అందరి మనసులోనూ గదే ఉందన్నట్టు సప్పుడు జేయలేదు.
ఇగ ఆటో శ్రీనివాసనగర్‌లో ఆగింది.
స్వరూప గంప, పాల డబ్బాలు పట్టుకొని దిగింది.
ఇంకో ఐదు నిమిషాలకు నళిని పాఠశాల దగ్గర ఆటో ఆగింది.
ఆమె ఆటోలనుంచి దిగి గేటు లోపలికి అడుగు పెట్టిందో లేదో, ‘‘జయ జయహే తెలంగాణ! జననీ జయకేతనం’’ అన్న తెలంగాణ జాతీయగీతం విద్యార్థుల గొంతున మధురంగా వినబడుతున్నది.
ఆ గీతపు ఉత్తేజమో, లేకపోతే ఆ పాటను రేపటి పౌరుల గొంతుల్లోంచి వినడమో ఏమో గానీ నళినిలో గొప్ప ఆశను కలిగిస్తుంటే, ఇక ఆ టీచర్ ఉత్సాహంగా బళ్లెకి అడుగు 
~ ఏదునూరి రాజేశ్వరి

గొల్ల రామవ్వ



golla-ramavvaఢాం....ఢాం....ఢాం!.... బాంబుల ప్రేలుడుతో అర్ధరాత్రి ప్రశాంత వాతావరణం ఛిన్నాభిన్నమైంది. సర్వత్ర నిండుకున్న నిస్తబ్ధతను చీల్చి ఆ ధ్వని తరంగాలు ఒక విచిత్ర సంచలనం కలుగజేసి శూన్యంలో విలీనమైనవి. గాఢనివూదలో నిమగ్నమై యున్న గ్రామమంతా ఒక్క పెట్టున దద్దరిల్లి పోయింది. ఆబాలగోపాలం గొల్లుమన్నారు... నిద్ర మబ్బులో ఏమి జరిగిందో ఎవరికీ బోధ పడలేదు... ఏదో ఆవేదన. ఏదో చికాకు . ఏదో బెగడు. కాని అంతా అగమ్యగోచరమే! ఊరి వారికందరికి ఒకే సమయాన ఏదో మహా భయంకరమైన పీడకల వచ్చి హఠాత్తుగా నిద్ర నుండి త్రుళ్ళిపడి లేచారా అన్నంత అలజడి చెలరేగిందా రెండు నిమిషాల్లో...

ఇంత అలజడి చెలరేగినా బజార్లు మాత్రం నిర్మానుష్యంగానే ఉన్నవి. లోపలి నుండి వేసుకున్న తలుపుల గొళ్ళాలు తీసి బయటికి తొంగి చూతామనుకున్న వారి చేతులు కూడా గొళ్ళాల మీదికి పోగానే ఎక్కడివక్కడ జలదరించి నిలిచిపోయినవి. చికాకు వల్ల కీచుకీచుమని అరుస్తూ తత్తరపాటుతో అటూ ఇటూ లేచి పోయే పక్షులరవం, వాటి రెక్కల తటతట, ఊరిచుట్టు పెరండ్లలో నుండి కుక్కల అరుపు, దొడ్లలో నిశ్చింతగా నెమరువేస్తున్న పశువుల గిజగిజ, అక్కడక్కడ దొడ్లకంపను విరుగవూదొక్కి ఊళ్లో తోచిన దిక్కల్లా పరుగెత్తే దున్నపోతుల గిట్టలరాపిడి-ఇవి మాత్రమే ఆ తదుపరి వినిపించినవి. అంతేకాని, ఒక్కసారి గొల్లుమన్న గ్రామస్తులు మాత్రం అదేదో దివ్య జ్ఞానబోధ కలిగిందా అన్నట్లు మళ్ళీ కిమ్మనలేదు.... బొడ్డూడిన కూనపర్యంతం ఎవ్వరు నిద్ర కూడా పోలేదు... ఏవో గుసగుసలు... ఏవో సైగలు... ఏవో అసహాయ ధృక్కులు... ఏవో వినపడని మ్రొక్కులు.... తల్లులు తమ పిల్లలకు శ్రీరామరక్ష తీశారు. పిల్లల దడుపు పోవడానికి ఎడమ అరికాలు దుమ్ముతో నొసట బొట్టు పెట్టారు. వీపు చరిచారు. కాని పిల్లల దడుపుకుపాయాలు యోచించే తల్లులకు తమ దడుపుకే ఉపాయం దొరకలేదు. బొట్టు పెట్టుకున్న చేతుల గాజులు గలగలమంటునే ఉన్నవి. ఉన్న చోటనే ఉన్న కాళ్ళ పాజేబులు కూడా కించిత్తు ఝంకరిస్తునే ఉన్నవి.

అదొక విచిత్ర ప్రళయం... అదొక క్షణిక మృత్యు తాండవం.
అదొక అస్థిరోత్పాతం.ఒక గంట గడిచింది. ఎప్పటివపూనే నలువైపుల అంధకారం అలుముకున్నది. చిమ్మట్లు ఏకక్షిశుతితో అరుస్తున్నవి. అంతా మామూలే! కాని నిద్ర మాత్రం ఊరి దరి చేరలేదు.
గొల్ల రామమ్మ తన గుడిశెలో చీకటిలోనే కూర్చుని ఉంది. ఆమె కాళ్ళు చేతులు కూడా వణుకుతున్నవి, కొంత వృద్ధాప్యం వల్ల, కొంత భయం వల్ల. ఆమె ఒడిలో ఒక పదిహేనేండ్ల బాలిక తలదాచుకొని ఉంది...

‘‘అవ్వా! గిప్పుడిదేం చప్పుడే?’’ అని మెల్లగా ప్రశ్నించిందా బాలిక.
‘‘నీ కెందుకే మొద్దుముండా. గదేంది. గదేంది - ఎప్పటికి అడుగుడే! ఏదో మునిగి పోయినట్లు! అన్ని నీకే కావాలె!.....’’
బాలిక మళ్ళీ మాట్లాడ సాహసించ లేదు. కొన్ని నిముషాలకు ముసలవ్వ తనంత తనే మెల్లగా గొణగడం మొదలుపెట్టింది. ‘ఏమనుకున్నవే తల్లీఁ మా పాడు కాలమొచ్చిందే! మీరెట్ల బతుకుతారో ఏమో బిడ్డా! ఈ తురుకోల్ల తోటి చావొచ్చింది... మొన్ననే నలుగుర్ని తుపాకినేసి చంపింన్రు. ఇప్పుడు కూడా ఏదో గసోంటి అగాయిత్తమే చేసివూనేమో!.... ఏం పొగాలమో వీల్లకు!....’
మళ్ళీ నిశ్శబ్దం... రామమ్మ, మల్లమ్మ ఇద్దరు తమ తమ యోచనల్లో పడిపోయారు. నిద్రకు మాత్రం సంపూర్ణ బహిష్కారమే! డెభ్బైయేండ్లు దాటిన రామమ్మకు జాగరణే, కొత్తగా వయసు వచ్చిన మల్లమ్మకు జాగరణే..

హఠాత్తున కిటికీ నెవరో తట్టారు... కిటికీ అంటే దాని ప్రాణమెంత? - మంటి గోడలో వెల్తురు కొరకని ఉంచబడ్డ ఒక రంధ్రం. దానికి చెదలు పట్టిన ఏదో చెక్కతో చేయబడ్డ రెండు చిన్న తలుపులు. ఇదే ఆ గుడిసెకు కిటికీ.
ఆ చప్పుడుకు లోపలి వారిద్దరు ఉలికిపడ్డారు. కూర్చున్న చోటునుండి కదలక శ్వాసోచ్ఛ్వాసాలు బిగబట్టి జాగ్రత్తగా వినసాగారు. కిటికీ తలుపులు గాలికి కొట్టుకొన్నవో లేక పిల్లి వచ్చి కదిల్చిందో అని...!
మళ్ళీ అదే చప్పుడు. ఈసారి అనుమానం లేదు. ఎవరో కిటికీ తలుపులు తట్టుతున్న మాట నిజం. గాలి కాదు. పిల్లి అసలే కాదు.
ఏం చేయాలి? ఎటూ తోచలేదు...

మళ్ళీ చప్పుడు. ఈసారి పెద్దగా వినపడింది. ఏదో స్థిరసంకల్పంతోనే తట్టినట్లు....
ఇక లాభం లేదు. ముసలవ్వ మెల్లగా లేవసాగింది. మల్లమ్మ గుండె దడదడ మాత్రం మితిమీరింది. అవ్వను గట్టిగా పట్టుకొని కంపించే గుసగుసలో ‘‘నాకు బయమైతాందే అవ్వా!’’ అనగలిగింది.
‘‘అట్లుండు! ఏందో చూత్తాం’’ అని ముసలవ్వ దృఢ నిశ్చయంతో లేచింది. అలవాటు చొప్పున చీకటిలోనే కిటికీ వద్దకి చేరుకుంది. లోపల గొళ్ళెం తీస్తూ తీస్తూ ‘‘ఎవర్రా?’’ అంది.
ఆ ప్రశ్న పూర్తిగా ఉచ్చరించబడిందో లేదో ముసలవ్వ నోరు గట్టిగా మూయబడింది. వెంటనే ఒక వ్యక్తి అతికష్టం మీద ఆ ఇరుకు కిటికీ గుండా లోపలికి చొరబడ్డాడు. అతని పాదాలు లోపలి నేలకు ఆనినవో లేదో అతడే కిటికీ తలుపులు బిగించాడు. ముసలవ్వ బీరిపోయి నిలుచుంది....
ఇంకో మూలన మల్లమ్వ గట్టిగా కండ్లు మూసుకొని కత్తిపోటుకై ఎదిరి చూస్తున్నట్లు పడి ఉంది. చిమ్మన చీకట్లో ఏదీ కనబడడం లేదు. ముసలవ్వకు మాత్రం సందేహం లేదు. గతానుభవమే అంతా సూచించినది. పోలీసో, రజాకారు తురకవాడో ఇంట్లో దూరాడు... ఇంకేముంది? తనకు చావు తప్పదు. తానల్లారు ముద్దుగా పెంచి పెండ్లి చేసిన తన మనుమరాలికి మానభంగం తప్పదు... ఎవదిస్తారీ రాక్షసుల్ని. తాను గోల పెడితే మాత్రం పక్క ఇంటి వారైనా వినిపించుకుంటారా? ఉహుఁ! కలలోని మాట!.... వాళ్ళవి మాత్రం ప్రాణాలు కావా? వాళ్ళ యింట్లో మాత్రం పడచుపిల్లలు లేరా? ఆనాడు అంత పెద్ద కరణం గారి కూతుర్ని బలాత్కారం చేసి ఎత్తుకు పోయినప్పుడెవరేం చేయగలిగారు? ఎవరడ్డం వచ్చారు?.... ఇప్పుడు తనకు మాత్రం దిక్కెవ్వరౌతారు?...

ఒక్క నిమిషం లోపల ముసలవ్వ ఇదంతా యోచించింది. ఇక జరుగబోయేది ఆమెకు స్పష్టంగా, అద్దంలోలాగ కనిపించసాగింది.
తాను చచ్చినా సరే తల్లిదంవూడులు లేని మల్లికైనా మానభంగం తప్పితే... తానా పిల్లను సాది సంబాలించింది తుదకీ రాక్షసునికి ఒప్పగించడానికేనా.... ముసలవ్వ కన్నీరు నింపుతూ కొయ్యవలె నిలిచిపోయింది. వృద్ధాప్యపు కంపనం కూడా ఎందుకో తనంత తానే స్తంభించిపోయింది.
ముసలవ్వకు, ఆ వ్యక్తికి మధ్య దాదాపు రెండు గజాల దూరముంది. యోచనామధ్యంలోనే ఆ వ్యక్తి ఆమెవైపు రెండడుగులు వేశాడు. చీకటిలో కూడా సూటిగా సమీపిస్తున్నాడు...
ఆమెకు మిన్ను విరిగి మీద పడ్డట్లయింది. ఇంకొక్క అడుగులో తన బ్రతుకు కొనముట్టుతుంది... ఆ తరువాత పాపం మల్లి...!
అతి కష్టం మీద ఆమె మూతి మూయబడింది. ఆమె ఆ క్షణంలో తనకు తెలిసిన దేవుళ్ళందరినీ స్మరించింది... మల్లమ్మ కోసం...

ఇంతలో ఆ వ్యక్తి గుసగుస వినబడింది.
ముసలవ్వ చెవిలో... ‘‘చప్పుడు చేయకు, నేను దొంగను కాను, రజాకార్ను కాను. పోలీసును కాను. మిమ్మల్నేమి అనను. లొల్లి మాత్రం చేయకండి...’’
‘అబ్బా! ఏమి టక్కరి! నమ్మించి గొంతుకోయడానికి చూస్తునట్టున్నాడు! తీయని మాటలతోనే సంతోషపెట్టి పాపం మల్లిని...!
అబ్బ! ఎంతకైనా తగువారీ రాక్షసులు! ఔను! ముందుగా తీయని మాటలు - అవి సాగకపోతే అన్యోపాయాలు. అదే కదా క్షికమం’...
ఎందుకైనా మంచిదని ముసలవ్వ వెంటనే ఆ వ్యక్తి రెండు కాళ్ళు దొరికించుకుంది... ఎంతో దీనంగా వేడుకుంది... ‘‘నీ బాంచెను! చెప్పులు మోత్తా, నా తలకాయైనా తీసుకో. పోర్ని మాత్తరం ముట్టకు. అది నీ చెల్లలనుకో... నీ కాల్లు మొక్కుత!’’

‘‘లేదవ్వా! నమ్మవేం చెప్పుతుంటే? నేను దుష్టుణ్ణి కాదు. నేనూ మీ అందరివంటి తెలుగోణ్ణే!’’
శుద్ధ తెలుగులో మాట్లాడుతున్నాడు. ముసలవ్వ ఇదివరలో ఏ తురకవాణ్ణి ఇంత చక్కగా మాట్లాడగా వినలేదు. తొశ్శతొశ్శగా మాట్లాడే నైజాం తురకలనే చూచిందామె. కాబట్టి ఈ వ్యక్తి తురక కాడేమోనని తర్కించుకుంది.
కొన్ని నిమిషాలపాటైనా చావు, మానభంగం తప్పినవి! ముసలవ్వకదే ఇంద్రజాల మనిపించింది! మానవ హృదయంలో నిహితమైయుండే అజేయ ఆశావాద శక్తి ఆమెకు చేయూతనిచ్చింది. వచ్చిన వ్యక్తి ఎంత అపరిచితడైనా, అతడు వచ్చిన పరిస్థితుపూంత అనుమానాస్పదమైనవైనా ముసలవ్వకు మాత్రం అతణ్ణి విశ్వసించాలనిపించింది. ఇది విశ్వాసం కాదు; విశ్వాస్వేచ్ఛ. విపద్దశలో గోచరించిన ఏకైక తరుణాధారం. దాన్నెలా జార విడుస్తుంది?

వచ్చిన వ్యక్తి కాళ్ళు పట్టుకొన్న ముసలవ్వ మెల్లమెల్లగా లేస్తూ అతని మోకాళ్ళు, నడుము, వక్షస్థలం, వీపు, ముఖం, తల తడుమసాగింది. ఒకే ఒక చడ్డీ ఉంది. చొక్కాలేదు. దేహమంతటా పల్లేరుకాయలు. చిగురంత, జిట్టరేగు ముండ్లు అంటుకొని ఎండిపోయిన రేగటిమన్ను, ఆ మంటిలో చిక్కుకొనియున్న తుంగపోచలు, గడ్డిపోచలు, వెంపలాకులు, తాటిపీచు వగైరా - ఇవన్నీ ముసలవ్వ చేతులకు కండ్లున్నవా అన్నట్లు గోచరించినవి. ఆపాదమస్తకం ఎన్నో చోట్ల శరీరం కొట్టుకుపోయినట్లు చర్మమే చెబుతున్నది. కొన్ని చోట్ల గాయాల నుండి స్రవిస్తున్న రక్తపు తడి ముసలవ్వ చేతి కంటింది. మరికొన్ని చోట్ల గాయాల నుండి ఎప్పుడో స్రవించి ఎండిపోయి అట్టుకట్టిన రక్తపు ఆనవాళ్ళు తగులుతున్నవి. శరీరమంతా జ్వరంతో రొట్టె పెంకవలె మసలి పోతున్నది... ముఖం మీద ముచ్చెమటలు క్రమ్మినవి. శ్వాస అతికష్టం మీద నడుస్తున్నట్లున్నది... మధ్య మధ్య ఆపినా ఆగని మూల్గులు బయట పడుతున్నవి. గుండె వేగం విపరీతమై పోతున్నది.
స్పర్శతోనే ఈ స్థితినంతా గమనించింది ముసలవ్వ. ఆ వ్యక్తి నిస్సహాయుడు. అపాయస్థితిలో హఠాత్తుగా తటస్థించిన శరణాగతుడు.

ఇంత తెలుసుకోగానే ముసలవ్వ మనఃస్థితిలో కాయాకల్పమైంది. అనిర్వచనీయమైన భావ పరివర్తనం కలిగింది. ఐదు నిముషాలకు పూర్వం మనుమరాలి శీలరక్షణ కోసం ఆగంతకుని కాళ్ళు పట్టుకుని ‘‘బాంచెను, కాళ్ళు మొక్కుత’’ అని వేడుకున్న ముసలవ్వ ఇప్పుడు ఆశ్చర్య సహానుభూతుల సమ్మిక్షిశిత స్వరంతో ‘‘ఇదేం గతిరా నీకు? గిట్లెందుకైనవు కొడుకా?’’ అని ప్రశ్నించింది.
‘‘ఏదో అవ్వా! అదొక కథ... కొంతసేపు నన్నిక్కడ దాచు. తరువాత నా దారిన నేను పోతాలే...’’ అని అతికష్టం మీద అన్నడాగంతకుడు.
‘‘ఆ! మా పోతౌ, మా పోతౌ... ఒక్కటే పోకడ! చక్కంగ స్వర్గమే పోతౌ... మంచి బుద్ధిమంతుడౌ పా!... హు! పోతడట యాడికో!’’
ఆగంతకుడు మాటాడలేదు. ముసలవ్వ వెంటనే మనుమరాల్ని పిలిచింది. ‘‘మల్లీ! ఓ మల్లిముండా! దీపం ముట్టియ్యే జెప్పన. నిదురొచ్చినాదే పోరీ’’...
దీపం మాట వినగానే ఆగంతకుడు ఉలికిపడి అన్నాడు. ‘‘అబ్బో! వద్దవ్వా వద్దు... దీపం వెలిగించకు నీ పుణ్యం... పోలీసులు నా వెంట పడ్డారు. పట్టుకుంటారు...’’
‘‘ఇగ చాల్లే మాట్లాడకు! పోలీసులకన్న ముందల సావు దేవతే పట్టుకునేటట్టున్నది నిన్ను!’’ అని ముసలవ్వ గద్దించింది.

మల్లమ్మ దీపం వెలిగించింది. ముసలవ్వ ఒక మూలకొక గొంగడి పరిచింది. దీపపు వెలుతురులో ఆగంతకుణ్ణి కొంత తడవు పరీక్షించింది. బక్క పలుచని యువకుడు, పదునెనిమిదేండ్లకు మించని వయసు. నూనూగు మీసాలు - గంభీరతను సూచించే కండ్లు. సుకుమారమైనప్పటికీ చాపతీగ బెత్తం వలె వంగగల దేహం. సౌమ్య సౌజన్యాల నీనే ముఖమండలం...
ఆ యువకుణ్ణి చూచిందో లేదో ముసలవ్వ ఆశ్చర్యం మేరమీరింది.
‘‘రాజోలిగె ఉన్నవు కొడుకా! నీ కెందు కొచ్చెరా ఈ కట్టం? .... పండు పండు.... ఆ గొంగల్ల పండు. బీరి పోతావేందిరా? పండు. ఆఁ! గట్ల ఁ మల్లిపోరీ! కుంపటి మీద కడుముంతెడు నీళ్ళెక్కియ్యే... అబ్బ! మంజగరున్నోలిగె కదుల్తది మబ్బు ముండ! ఈడ పోరని పానం పోతాందంటే దీనికి నిర్దమబ్బే వదల్లేదు... ఊఁ! కానీ జెప్పున, ఎక్కిచ్చినవా కడుముంత? ఆ ఁ ! ఇగరా... దీపం పోరని దగ్గరకు తే... దీపానికి ఇంటి తలుపుకు నడుమ నా గడంచె నిలబెట్టు. దానికి నా గొంగడి ముసుగెయ్యి.... ఏసినవా? ఆఁ గట్ల. గిప్పుడు కొద్దిగ వుశారయింది పొల్ల! మొగుడు నాలుగు మల్కల పెయ్యి మెదిగబెడితే ఇంకా కుదుర్తది చురుకు!... కొద్దిగ సందుంచి ఓ కంచుడు బోర్లియ్యి దీపంతె మీద. ఆ పోరని మీద ఎలుగు పడాలె. కడుమ దిక్కుల్ల చీకటే ఉండాలె. గట్ల కావాలె ఉపాయం... ఆఁ! గంతె! ఉన్నదే ఒనరు నీ దగ్గెర! మా చేత్తవులే సంసారం!... ఇక కూకో వాని పక్కన. ముండ్లు తీసెయి ఉల్లుల్లుగ... అయొ! సిగ్గయి తాందా వాన్ని ముట్టుకుంటె? ఏం మానపతివి గదనే! నీ సిగ్గు అగ్గిలబడ! వాని పానం దీత్తవా యేం సిగ్గు సిగ్గనుకుంట? ఊఁ! చెయ్యి చెప్పిన పని! పాపం పీనుగోలె పడున్నడు గాదె! వాన్ని జూత్తె జాలి పుడుతలేదె నీకు దొమ్మరముండా?... ఆ! గట్ల! నొప్పిచ్చకు పాపం!...’’


మహా ప్రవాహం వలె సాగిపోతున్నది ముసలవ్వ గొణుగు ధోరణి. అందులోనే చివాట్లు, అందులోనే వినోదం, అందులోనే ఆజ్ఞలు - ముసలవ్వ ఆజ్ఞలన్ని చకచకా అమలౌతున్నవి. యువకుడు నిజంగా అర్ధశుద్ధావస్థలో పడియున్నాడు. మల్లమ్మ జిట్టరేగుముండ్లు ఒక్కొక్కటి తీస్తున్నది. యువకునికేదో క్రొత్త లోకంలోకి వచ్చినట్లుంది.

ముసలవ్వ మళ్ళీ ప్రారంభించింది.
‘‘వచ్చినాయె ముండ్లన్ని? - మా కట్ట పడుతున్నావే పొల్లా! పున్నెముంటుంది నీకు. మల్ల పెతరమాసకు తుంటకొక్కంత బుడ్డోన్ని కంటవులే! సరె. ఇగబటు... నీల్లెచ్చబడ్డయి... ఈ పేగు నీల్లల్ల ముంచి వాని గాయాలన్ని కాపు. ఆ రౌతం మరకలు, మంటి ముద్దలు తుడిచి పోరెయ్యి తానం జేసినట్టు కావాలె - పాపం! ఎంత సుకాశిపెయ్యే పొల్లంది! ముట్టుకుంటే దూదోలిగె తలుగుతాంది! ఎసోంటోని కెసొంటి గతొచ్చిందే!’’

చూస్తూ చూస్తూ మల్లమ్మ పరిచర్యవల్ల యువకుని గాయాల బాధ తక్కువయింది. దేహమంతా శుభ్రమైంది. మెల్లమెల్లగా తేరుకున్నాడు.
ఇంతలో ముసలవ్వ తలెలో ఏదో తెచ్చింది. యువకుని తలాపున కూర్చొని అతని తల నిమురుతూ గొణగసాగింది.

‘‘ఇగ లే కొడుకా కొద్దిగ గింత గటుక చిక్కటి సల్లల పిసుక్కచ్చిన... గింత కడుపుల పడేసుకో. ఎన్నడన్న తాగినావు తాతా గట్క? వరిబువ్వ తినెటోనికి నీకే మెరుక? గొల్లరామి గట్కంటే ఏమనుకునౌ? పొయ్యే పానం మర్లుతది! చూడు మరి - కులం జెడిపోతవని భయపడుతున్నవా? నువ్వు బామనోడవైనా, జంగమోడవైనా, యేకులమోడవైనా సరే - మొదలు పానం దక్కిచ్చుకో. అంతకైతె నాలికెమీద బంగారి పుల్లతోటి సురుకుపెడితే పోయిన కులం మల్లత్తదట కాదు? - ఆఁ! ఇగ తాగి పాయ్యి గటగట!-’’

యువకుడు లేచి కూర్చున్నాడు. ముసలవ్వ మాటలకు కొద్దిగా నవ్వు వచ్చిందతనికి. చిరునవ్వు ముఖంతో ముసలవ్వను చూస్తూ తలె అందుకున్నాడు. అందులోది నవజీవన సర్వస్వ సారమన్నట్టు ప్రీతితో గటగట త్రాగాడు - ముసలవ్వ మాట అక్షలారా సత్యమైంది. సగం పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి. యువకుని ముఖం మెల్లమెల్లగా వికసించింది. కండ్లలో జీవనజ్యోతి వెలుగజొచ్చింది.
ముసలవ్వకు పూర్ణ సమాధానమైంది. యువకుని వైపు చూస్తూ, ముడుతలు పడ్డ ముఖంతో నవ్వుతుంటే ముడుతలన్ని అంతర్ధానమైనవా అనిపించింది. కొన్ని నిముషాల పాటలాగే ఉండిపోయారు ముగ్గురు...

యువకుని దేహాన్ని ప్రేమతో నిమురుతున్న ముసలవ్వ చేయి హఠాత్తుగా అతని చడ్డీ జేబు వద్ద ఆగిపోయింది. వెంటనే ‘‘గిదేందిరో?’’ అంటూ ముసలవ్వ ఆ జేబులో చేయి వేసి ఒక ఉక్కు వస్తువ తీసింది.

‘‘అది రివాల్వరవ్వా! తోటాల తుపాకి..’’ అన్నాడు యువకుడు.
‘‘ఎందుక్కొడుకో తుపాకి? మమ్ములగిట్ల చంపుదామనుకున్నావా, యేంది?’’ అన్నది ముసలవ్వ.
‘‘లేదవ్వా! మిమ్మల్ని చంపేవాళ్ళను చంపే అందుకది... ఈ రాత్రి ఇద్దరు పోలీసులను హత మార్చాను. మొన్న మీ గ్రామంలోని నలుగురు నిర్దోషుల్ని కాల్చి చంపిన పోలీసులే!’’
ముసలవ్వ ముఖ లక్షణాలు వర్ణణాతీతంగా మార్పు చెందినవి. మొదట కొద్దిగా భయం, ఆ తదుపరి తెగువ, ఆ తరువాత ఉత్సాహం, ఆ వెనక విజయోల్లాసం క్రమశః గోచరించినవి.
యువకుడు ముసలవ్వ ముఖాన్ని సూక్ష్మంగా పరీక్షిస్తున్నాడు. భావ పరివర్తన చూచినకొద్దీ అతని మానసం పరిపరి విధాల తర్కించుకుంటున్నది. ఆ విషయం ఎందుకు చెప్పానా అన్న పశ్చాత్తాప రేఖ కూడా అతని మనస్సును ఒకసారి స్పృశించి పోయింది. ఏమంటుందో ఈ వృద్ధురాలు? శతాబ్దాల దాస్యమనుభవించి దలితమైన ఈ అమాయక గ్రామీణ సమాజంలో తేజమెక్కడ శేషించింది. ఎలాగైనా ఆ గుడిశె ఆశ్రమం నుండి తనకుద్వాసన జరిగి తీరుతుందని అతనికి తోచింది. ఇద్దరు పోలీసులను చంపిన హంతకుణ్ణి ఎవరుండనిస్తారు? ఎంతమంది తన తోటి కార్యకర్తలు ఈ గ్రామస్థుల పిరికితనం వల్ల పట్టు పడలేదు? యువకుని మనస్సు ఎన్నెన్నో వితర్కాలకు లోనౌతున్నది.

కొంత సేపు యోచించి హృదయం ధడుక్కుమన్నది.
‘‘ఇద్దర్నా?... కాని ఇంకిద్దరు మిగిలిన్రు కొడుకా! సగం పనే చేసినవు...!’’
యువకుడు చకితుడైనాడు. అతని సుసంస్కృత మానసం గర్వోన్నతమై కల్పనాకాశంలో భ్రమణం సాగించింది. అతని తారుణ్యానురూప భావుకత్వం అతణ్ణి మైమరపించింది. శ్రీరామస్మరణ వల్ల ఉప్పొంగే హనుమంతుని దేహం వలే తన దేహం కూడా ఉప్పొంగి పోయినట్లనిపించింది. రివాల్వరు కొరకై చేయి చాస్తూ ‘‘తక్కినవాళ్ళను కూడా చూచుకొస్తా తే అవ్వా!’’ అనేశాడు.
ముసలవ్వ రివాల్వరు లాక్కొని ప్రారంభించింది.

‘‘చాల్లే చేశిన కాడికి! బాద్దురుగాడవు పా! బాగ తిని ఉండబుద్దిగాక పోలీస్ తోటే వైరం పెట్టుకుంటడట ఉచ్చిలిపోరడు! ఎందుకురా నీకు పోలీసోల్ల తోటి కైలాట్కం?’’
యువకుడన్నాడు ‘‘నేను స్టేట్ కాంగ్రెస్ వాలంటియర్ను. నైజం రాజు తోటి కాంగ్రెస్ పోరాడుతున్నది. ప్రజలు పోరాడుతున్నారు.’’
యువకుడేదో రాజకీయ సిద్ధాంత బోధ ప్రారంభిస్తాడా అనిపించింది. కాని మధ్యలోనే ముసలవ్వ అందుకున్నది. ‘‘యాడున్నదిరా నీ కొట్లాట? ఈడనైతే పెద్ద పెద్దోల్లంత ఆ తురుక పోలీసోల్లనే ఇండ్లల్ల పండ బెట్టుకుంటాన్రు గాదు? ప్యాదోల్లు కొట్లాడితే ఏమైందిరా?’’
‘‘పేదవాళ్ళతోనే నడుస్తున్నదవ్వా కాంగ్రెస్ పోరాటం...’’ అన్నాడు యువకుడు.
‘‘మరైతే నీది కాంగిరిజో గీంగరిజో అండ్ల ఈడుపడ్డోల్లు లేరార? గడ్డాలు, మీసాలు నరిశినోల్లంతయాడ విరగడైపోయింన్రు?’’

‘‘వాళ్ళందరు పట్నంలో ఉంటారు. రాజుతో మాట్లాడుతారు. ప్రజల తరఫున వాదిస్తారు. అధికారాలు ఇప్పిస్తారు. నాయకత్వం చేస్తారు.’’
ముసలవ్వ విసుగుతో అందుకుంది. ‘‘ఏహే! గదంత నాకు మనసున పట్టది. పెద్ద పెద్దోల్లేమొ ముచ్చట్లు పెట్టుకుంట కూకుంట రట! పసి పోరగాల్లనేమొ పోలీసోల్ల మీదికి పొమ్మంటరట! ఇగ యీ పొల్లగాల్లేమొ చేసుకున్న పొల్లల ముండ మోపుటానికి తుపాకులు బుజానేసుకుని బైలెల్లుతురట! ఎంత పాడుదిన మొచ్చింది. అన్నాలం పాడుబడ!’’
అలాగే కొంతసేపు గొణిగి ముసలవ్వ ఆజ్ఞాపించింది. ‘‘అరేయ్! ఇగ కొద్దిగ కన్ను మలుపుకో. జాము నాత్తిరున్నదింక. ఇంత నిర్ద పట్టితే బతుకుతవు. వశేయ్ మల్లిపోరీ! మనిద్దరం తెల్లారేదాక కావాలుండాలే. నువ్వా కొనకు. నేని కొనకు. కూర్పాట్లు పడ్డవంటే యాదుంచుకో - ఒక్క చరుపుకు దయ్యం వదిలిపోవాలె మరీ - ఆఁ’’

పాలు పిండేవేళ అతిక్రమించి పోతున్నది. ఇండ్ల వెలుపల కట్టివేసి యున్న గేదెలు లోపలి దుడ్డెల కొరకు అరుస్తున్నవి. లోపలి నుండి దుడ్డెలు విలపిస్తున్నవి. పాల చేపుల ఆతురత ఒకవైపు. ఆకలి బాధ రెండవవైపు. కాని పాలు పిండబడడం లేదు. రోజు ఈ పాటికి ఎటువిన్నా జుంయి జుంయి మనే పయస్సంగీతం నేడు సంపూర్ణంగా నిలిచిపోయింది. భయం వల్ల గ్రామంలోని జీవ లక్షణాలన్నీ ఒక్కుమ్మడి లుప్తవూపాయమై పోయినవి. మృత్యు సమయపు అంతిమ సంచలమైనా లేదు.
స్మశానవాటికలోని కాటి చిటచిటలైనా లేవు. ఆ గ్రామంలో అనాది కాలం నుండి అంతా నిశ్శబ్దమే అన్నట్లనిపించింది.
రామమ్మ, మల్లమ్మ ఇద్దరు కావలి కాస్తున్నారు. యువకుడు సుఖనిద్ర పోతున్నాడు. చీమ చిటుక్కుమన్నా అదిరిపడే అంత నిదానంగా ఉన్నారు గ్రామ ప్రజలు. కాని చీమ కూడ చిటుక్కుమనడం లేదు. గత రాత్రి భయంకర సంఘటనకు కారకుడైన ఆ యువకుడొక్కడే నిద్రిస్తున్నాడు. తక్కిన గ్రామమంతా శ్వాస బిగబట్టి నిరీక్షిస్తున్నది.
దేనికో? ఎవరికోరకో? ఎందుకో? ఇదంతా... అంతరికీ తెలుసు. పాతకథే!...

రామమ్మ యోచిస్తున్నది. ఎవరో కాంగ్రెస్ వారు ఊరికి వచ్చారన్న నేరంపైన ఇదివరకే నలుగురు నిర్దోషులు కాల్చివేయబడ్డారు. ఇక ఈసారో, ప్రత్యక్షంగా ఇద్దరు పోలీసులే చంపబడ్డారు. ఠానా భగ్నం చేయబడింది. ఊరినంతా దగ్దం చేసి ఊరివారందరిని కాల్చివేసినా ఆశ్చర్యం లేదు. అదొక పండుగే! ఏ ఒక్క ఇంట్లోనో పోలీసులు చొచ్చి హత్యలు, మానభంగాలు సాగించడం, ప్రక్క ఇంటివారు కిమ్మన లేకపోవడం. ఈ విధంగా ఒక్కొక్క యింటి లెక్కన తుదకందరి కదేగతి పట్టడం. ఇంతకన్న ఊరి వారందరు ఒకేసారి చంపి వేయబడటం మేలు కదా? పదిమందితో చచ్చినా మంచిదే, బ్రతికినా మంచిదే కుక్కచావు కన్న!
నిద్రిస్తున్న యువకునికి తల నిమురుతూ రామమ్మ గొణిగింది. ‘‘అబ్బ! ఏం పోరడు! ఇసోంటోప్లూంత మంది చావాల్నో ఇంక!’’
అకస్మాత్తుగా బజారులో మోటార్ ట్రక్కు చప్పుడైంది. ఎటు విన్నా బూటు కాళ్ళ తటతటలే వినరాసాగినవి. ఏవో అరుపులు, తురకభాషలో తిట్లు - దుర్భాషలు ప్రగల్భాలు. ఛటేల్ ఛటేల్‌మని మధ్య మధ్య కొరడా దెబ్బలు.

‘‘చస్తి! చస్తి! నీ బాంచెన్.... నా కెరుకలేదు. అయ్యొ! వావ్వొ! వాయ్యో!!’’ అన్న అరుపులు.
మిన్ను ముట్టే ఆక్రోశాలు. అంతకు మించిన క్రూర నినాదాలు. ఒండొంటితో పోటీ చేస్తున్నవి. మనుష్యులు ఉన్న వారున్నట్లు బజార్లలో ఈడ్వ బడుతున్నరు. రెండు గడియల క్రితం స్మశానవాటికను మరపించిన గ్రామం ఇప్పుడు యమపురిని తలదన్నుతున్నది...
మల్లమ్మ గడగడలాడింది. యువకుడు దిగ్గున లేచి కూర్చున్నాడు. ఆ గాఢ నిద్ర క్షణంలో మటుమాయమైపోయింది. రివాల్వరు ముసలవ్వ చేతి నుండి తీసుకొని తోటా పూక్కించాడు. బయట జరుగుతున్న అలజడి రెండు నిముషాల వరకు విన్నాడో లేదో - అతన్నో మహావేశం ఆవరించింది.
ముసలవ్వ స్థితి మాత్రం చెప్పేటట్టు లేదు. అది భయం కాదు. వ్యాకులత కాదు. దుఃఖము అసలే కాదు. అపూర్వమైన నిశ్చలత్వం, గాంభీర్యం ఆమెలో ప్రవేశించినవి. బయటి హాహాకారం చెవి సోకిన కొద్ది ఆమెలో కూడా అదొక రకపు ఉద్వేగం బయలుదేరసాగింది.

రివాల్వరులో తోటాలు నింపుకుని యువకుడు దిగ్గున లేచాడు. తలుపు వద్దకి చకచకా నడిచాడు. గొళ్ళెం మీద చేయి పెట్టాడు. తీయబోయాడు కాని.. కాని వెంటనే అతిని చేయి మీద మరొక చేయి వచ్చి పడింది. అది ఉక్కుచేయి కాదుగదా అన్నంత దృఢతరంగా తగిలిందని చేతికి. అతడు మహాశ్చర్యంతో వెనకకు తిరిగి చూశాడు. ‘ఆఁ’ అన్నాడు.
ముసలవ్వదే ఆ ఉక్కు చేయి!

‘‘యాడికి?’’ అని ప్రశ్నించింది ముసలవ్వ. యువకుని మాట తడబడ్డది. తుపాకి గుండ్ల మధ్య విహరించే ఈ వీర యువకుడు, రాక్షసులనైనా నిర్భయుడై ఎదిరించే ఆ శూర శిరోమణి, దేశ కల్యాణానికై ప్రళయాన్నైన ధిక్కరించే తరుణ సింహం, నేడొక్క డ్బ్భైయేండ్ల ముసలవ్వ ప్రశ్నకు జంకాడు.
అతని గుండె జల్లుమన్నది. కాని వెంటనే గొంతు సవరించుకొని అన్నాడు. ‘‘ఎక్కడికేమిటవ్వా అటో ఇటో తేలిపోవాలి. హింస జరుగుతుంటే చేసినవాణ్ణి నేను దాగుకోవాలా? దాగడం మాత్రమెంతసేపు? ఈ యిల్లు సోదా తప్పుతుందా? పైగా నా వల్ల మీకు అపాయం కలుగుతుంది - నన్ను పోనీ అవ్వా!’’
ముసలవ్వ మాట్లాడలేదు - యువకుని చేయి పట్టి వెనకకు లాగింది. మంత్రముగ్దుని వలె అతడామెను అనుసరించాడు.

బయట అలజడి అధికమైంది. బూటుకాళ్ళ చప్పుడు గుడిసెను సమీపిస్తున్నది. ముగ్గురు నలుగురు వ్యక్తులు గుడిసె ముందు నుండి పక్క ఇంటి ముందటికి వెళ్ళారు. ఆ వెనక
‘‘రామ్‌ధన్ గడ్‌రీకీ గుడ్సీ యహీ హై’’ అన్న మాటలు వినిపించినవి.
మళ్ళీ ఒకసారి యువకుడు బయటి తలుపు వైపు పోబోయాడు. కాని ముసలవ్వ అతన్ని వెనక్కి నెట్టింది. రివాల్వరు అతని చేతి నుండి లాగుకుంది. మినుకు మినుకు మంటున్న దీపాన్ని పూర్తిగా ఆర్పింది. మల్లమ్మను పిలిచి చెప్పింది.
‘‘పొల్లా! నిన్న మర్రి కొంరడు కట్టుటానికియ్యలే? ఆ దుప్పటీన్ను కండువ తీస్కరా! యాడబెట్టినవోతే ఎల్లెం తెచ్చినవా? ఆఁ! పిల్లగా! ఆ దుప్పటి కట్టుకో కండువ నెత్తికి చుట్టుకో ఊఁ యేమాయే గింతసేపా? మల్లీ! నీ రెండు చేతుల దండకడ్యాలు వానికియ్యి... బక్కపల్చటోడు మా పట్టుతై... ఆఁ పట్టినయా? గంతే! ఒక్క కుర్మదారముంటే బాగుండు. ఇప్పుడేడ దొరుకుద్ది? ఊఁ లేకుంటే లేకపాయె. ఈ పోరని చడ్డి కూరాటి కుండ కింద దాచిపెట్టే పొల్లా! ఆఁ గొల్లేశ మేసినవా కొడుకా? అచ్చం ఎర్రగొల్లే నోలిగేనే ఉంటవు! ఎవడన్న మాట్లాడిత్తె గొల్లోనోలె మంచిగ మాట్లాడాలె...’’
‘‘ఆఁ’’ అన్నాడు యువకుడు.

దాగి తిరిగే కార్యకర్తలకు గొల్లవేషాలు మామూలే కనుక యువకుడు సంసిద్ధుడైనాడు. వేషం తయారయింది. ఇక ఏ త్రోవనో బయట పడడం మాత్రమే శేషించింది. ముసలవ్వ ఆజ్ఞకై నిరీక్షిస్తున్నాడు.
అకస్మాత్తుగా తలుపు మీద నాలుగైదు సార్లు దిబదిబమని దెబ్బలు పడ్డవి. ‘‘రామా ఓ రామీ! ఓ గొల్లరామీ! తల్పూకీ ఖోల్’’ అనే కర్కశ స్వరాలు వినిపించినవి. కొందరు బూట్లవాళ్ళు ఇంటి చుట్టు దగ్గర దగ్గరగా నిలుచుంటున్న అలికిడి వినవచ్చింది. ఇంకేముందీ? తప్పించుకునే వీలులేదు. ఈ గొల్ల వేషమంత వ్యర్థమైనట్లే. యువకుని చేయి రివాల్వరుకై వెదకసాగింది. కాని ముసల్వను అడిగే ధైర్యం రాలేదు.

ముసలవ్వ గుసగుస ప్రారంభించింది? ‘‘మల్లీ! ఆ మూలకు మంచం వాల్చి గొంగడెయ్యె. పిల్లగా! అండ్ల పండుకో. ఊఁ పండుకో.’’
యువకుని కెటూ తోచలేదు. ఇంతకూ తుదకు పట్టుపడటమే నొసట వ్రాసి యున్నట్లుంది. అలా మంచంలో పడుకోవడం వల్ల లాభమేమో అతనికి బోధ పడలేదు. విధి లేక పడుకున్నాడు.
మళ్ళీ తలుపుమీద దిబదిబ!
‘‘ఓ రామీ! తల్పూ తీస్తా లేదూ. తూ భిన్న హరాంజాదీ! మాట్లాడౌ! మాట్లాడౌ! నీకి తోడ్కల్ తీస్తం ఠైర్! ఫౌరన్ తీ తల్పు, లేకుంటే తోడాయిస్తం సూడు.’’
ముసలవ్వ ఇప్పుడిప్పుడే నిద్ర లేచిన దాని వలె ఆవలిస్తూ ఒళ్ళు విరిచిన చప్పుడు చేస్తూ అర్ధ స్పష్టంగా ప్రారంభించింది.
‘‘ఎవ్వర్రా పెద్ద దొంగనాత్తిరచ్చి తలుపు కొడ్తాన్రు? దొంగముండ కొడుకులున్నట్లున్నరు! మీ ఇల్లు పాడుబడ. పోలీసోల్లు రాత్రి గత్తుకత్తె మీ యీపులు పెట్న బలుగుతయ్.’’
బయటి వాళ్ళు ‘‘మేం పోలీసోళ్లం’’ అని ఇంకా ఏమేమో చెప్పబోయారు. కాని ముసలవ్వ ఒక్క అక్షరం కూడా వినిపించుకోలేదు. బిగ్గర బిగ్గరగా అరుపులు, మధ్య మధ్యన రెండు మాటల గుసగుస.
‘‘కాలం పాడుగాను! ఎవ్వల కొంపలవాళ్లను పడుండనీయరు. నాత్తరనక పగలనక చంపుతాంటరు.’’
‘‘పొల్లా! పోరని మంచానికి నా గడెంచే అడ్డం పెట్టు.’’

‘‘నన్నేం దోసుకుంటర్రా? ముసలి ముండ దగ్గరేమున్నది? దొంగలైతే ఉన్నోన్ని దోచుకోండి, లేవలేం దాన్నెందుకు చంపుక తింటరు. అబ్బబ్బ! తలుపు పలగొ ఉన్నది. ఆగరాదుండి? కట్టెత్తె తప్పా గుర్రాన్ని? లేవలేని ముండను. చెంగుచెంగున గంతుపూయ్యాల్నా మీ తొందరకు.’’ ‘‘మల్లీ! మాట్లాడక ఆ పోరని పక్కల పండు ఊఁ నడూ!...’’
‘‘ఇగ పగులగొట్టండ్రి! లేచి తలుపు తీసేదాక గూడా ఒపిక లేకపోతే పగులగ్గొట్టండ్రి. ఇంట్లజొచ్చి నా దగ్గరున్న రావన వరాలు తలిన్ని దోసుకోన్రి... దీపమన్న ముట్టిత్తామంటే కుంపట్ల అగ్గి లేదు. ఈ మల్లి ముండకు ఎన్నిసార్లు చెప్పిన మాపటాల్ల కుంపటి కప్పదు. ముదనట్టం ముండ! ఇగ నిన్న మొగడచ్చిండేమొ, దానికి పట్టపగ్గాల్లేకుంటున్నది. ఏ పని చెప్పినా యినుపించుకోదు. నడుమనే ఆగమైతాంది. మొగన్ని చూచి మురిసిపోతాంతి. వగలముండ!...’’
‘‘చెయ్యేసి పండుకో పోరడా దానిమీద! చూసెటోని కనుమానం రావద్దు.’’
‘‘ఇగ నా చాతాగాదురా తండ్రీ ఈ మల్లి ముండ లేవలేదు. ఓ మల్లీ! ఓరి మల్లిగా! ఉహూఁ వీల్లు లేవరు నీకు దీపప్పంతె దొరకదు చీకట్ల! వీల్ల వైస్సు వక్కలుగాను, బజార్ల గంత లొల్లయితాంటె మా రాజుగ గుర్రుకొడుతాన్రు...ఈ అంగడప్పోరి నేంజేతు?... నా ముంగట్నే కొడుకు కోడలు రుచ్చాలోలె పడిపోయిన్రు. ఈ పోర్ని నా నెత్తిన పడేశిన్రు. దెబ్బకొడ్తెనేమొ రద్ది. కొట్టకుంటే బుద్ధిరాదు. ఎక్కడి పీడ తెచ్చి పెడితివిరా నా పానానికి! యాడున్నవురో కొడుకా! నా కొడుకా! ముసలిముండకు చెరబెట్టి పోయినావు కొడుకా! నా కొడుకా! నేనేం జేతురో కొడుకో! నా కొడుకా’’!

ముసలవ్వ మహార్భాటంతో రాగం పెట్టి ఏడువసాగింది. బయటివాళ్ళు నానావిధాల మాట్లాడుతున్నరు. ‘‘పాపం పోనీ’’ అని ఒకరు. ‘‘అబ్బో ఈ ముసలిది చాలా బద్మాష్’’ అని మరొకరు. మొత్తానికి సోదా జరిగి తీరాలని అందరూ నిశ్చయించారు.
లోపలి నుండి గొణుగు సాగుతూనే ఉంది. ‘‘అవ్వల్ల! అయ్యల్ల! ఆగున్రి తలుపు తీశేదాక అవ్వల్ల! అయ్యల్ల!’’
‘‘తోడ్ దేవొరే దర్వాజా’’ అని బయట ఆజ్ఞ ఇవ్వబడుతుండగనే ముసలవ్వ తలుపు గొళ్లెం తీసింది. ఇద్దరు పోలీసులు ఒక్కుమ్మడి తలుపు నెట్టి తలుపు తెరువబడడంతోనే అమాంతం ఒకరి మీద ఒకరు పడ్డారు.
వాళ్ళు పడడంతోనే ముసలమ్మ పెద్దకేక వేసింది. వాళ్ళు లేవడంతోనే వాళ్ళ క్రిందనే పడ్డట్టుపడి ఏడవసాగింది.
‘‘చంపతిర్రా! నీ దౌడలుబడ - ముసల్దాని పానం తీత్తిర్రా! ఇగ చూసుకోండి ఆ పడుచు పోరగాండ్లాడ మంచంల పడున్నరు. ఈడ నేనున్న, కుండలటున్నయి. గురుగులున్నయి. తలెముంతలున్నయి. పోరి మెడల గంటెపుత్తలున్నయి. పోరగానికి రెండు దండి కడియాలున్నయి. ఇగేం కావాల్నో తీసుకోండి, చంపాల్నంటే చంపుండి. నన్ను చంపండి. పొల్ల ముండమొయ్యక ముందు దాన్ని గూడ తుపాకి నెయ్యండి. ఇద్దర్నొక్కసారే చంపుండి. అప్పట్నుంచి నన్ను చంపుక తింటాన్రు. ఇగ జుర్రుకోండి ఏం జుర్రుకుంటరో!...’’

మల్లమ్మ మెల్లగా కండ్లు నులుముకుంటు మంచం దిగి వ్యాకుల దృష్టితో అటూ ఇటూ చూడసాగింది. యువకుడు కూడా ఆవులిస్తూ లేచి మంచం మీదనే కూర్చున్నాడు.
పోలీసు వారందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకోసాగారు. ముసలవ్వ ధోరణి నడుస్తూనే ఉంది.
‘‘ఇంకేం చేత్తరో చెయ్యరాదుండి... తుపాకులున్నై గద... చంపరాదుండి నన్ను. ఇగ బతికినన్నోద్దులు బతుకుతనా?....’’
యువకుని వైపు చూపిస్తూ పోలీసు జమాదారు ప్రశ్నించాడు. ‘‘వాడు యెవడున్నడ్ చెప్పు! కాంగ్రెసోడాయేం?....’’

ముసలవ్వ నెత్తిన నోరు పెట్టుకొని అరవసాగింది.
‘‘వాడెవ్వడా? ఎవ్వడు పడితే వాడు మా పక్కల్ల పండుటానికి మేమేం బోగమోల్లమనుకున్నావా? నిన్నెవడన్న గట్టనే అడుగుతె ఎట్టుంటది? ఆ మాటత్తోటి మానం దీసుడెందుకు? పానం తియ్యరాదుండి! నా బుద్దెరిగిన కాన్నుంచి నేనైతే గింత బేఇజ్జతి మాట యెవ్వల్లనోట్నుంచి యినలే. ముసల్తనానికి ఇయ్యాల మానం పోయింది. ఇగ యాన్నన్న ఉరిబెట్టుకుని చస్తేంది. ఇలాంటి బతుకు బతికిందానికన్న?.... వాడు మా మల్లడైతడా కాడా ఊరోల్లందర్ని తెలుసుకోన్రి. వెలగచ్చినంక బాగ పరిచ్చవట్టి చూస్కోండి. కాని గిసొంటి బే కంగాలు కూతపూందుకు. మేమసంటోల్లం కాదు బాంచెను! ఏదో మీ పాదాలకింద బతుకుతాన్నం. బైటోడు గొల్లరామి గుడిశెలకొచ్చి తప్పిచ్చుకుంటాడు? పానం పట్టుకచ్చి అప్పచెప్పవయ్య? గొల్లరామెసోంటిదో ఊరోల్లనడుగుండి!’’
అప్పటి తీవ్రతకు, ఇప్పటి విధేయతకు పోలీసులు చకితులైనారు. ఏమనుకోవాలో, ఏం చెయ్యాలో వారికి తోచలేదు.

‘‘పోన్రి బాంచెను! ఈడేం లేదు. నా మాట అబద్దమైతే తలకాయ కోశిత్త. నేనేడికి ఉరికిపోను. ఈడ్నే ఉంట. నా మాట డాకల చూడుండి. ఇగ తిప్పల బెట్టకుండి!’’
పోలీసు జమాదారు కొంతసేపు యోచించి లేస్తూ అన్నడు. ‘‘అచ్ఛా! నేన్ పంచనామా చేస్క్రోనీ వస్తా. నీ బయాన్ని తీస్కుంటా. వీన్కి హాజర్ చెయ్యాలె. లేకుంటే నీకీ షూట్ చేస్తా, తెల్సిందీ.’’
జమాదారు బయలుదేరాడు. ముసలవ్వ మంచం మీద కూర్చుంది. ఒక వైపు యువకుడు మరోవైపు మల్లమ్మ అదొక అపూర్వ సమ్మేళమనిపించింది యువకునికి.
‘‘అవ్వా! నీవు సామాన్యురాలవు కావు సాక్షాత్ భారతమాతవే’’ అన్నాడు యువకుడు భావలీనతలో కండ్లు మూసి.
దోడ్త్! కొంటె పోరడా! నాకే పేర్ల బెడుతున్నావు?... నా పేరు గొల్లరామి! గంతే... ఇగ నువ్వెల్లు... మల్లిని అత్తోరింటికి తోలుకపోత, పొద్దెక్కుతాంది... ఊఁ యెల్లు...’’
ముసలవ్వ ఆజ్ఞ అనుల్లంఘ్యుమైందని యువకుడది వరకే తెలుసుకున్నాడు.
(కాకతీయ పత్రిక; 15-0-1949)

మన పి.వి. కథ
NarasimhaRaoఒక సాహసవంతుడైన ఉద్యమకారుడిని గొల్ల రామవ్వ రక్షించే ఇతివృత్తం ఈ కథలో అపూర్వంగా ఆవిష్కారమైంది. దీన్ని రాసింది మన మాజీ ప్రధాని పి.వి. ఈ ఒక్క కథ చాలు పి.వి. కీర్తిని సాహిత్యచరివూతలో చిరస్థాయిగా నిలబెట్టడానికి!
ఆయన 1921లో కరీంనగర్ జిల్లాలోని వంగర గ్రామంలో జన్మించారు. వరంగల్లు, నాగపూర్‌లలో విద్యాభ్యాసం చేసారు. వందేమాతరోద్యమంలో పాల్గొన్నారు. ఆంధ్రవూపదేశ్ ముఖ్యమంవూతిగా, భారత ప్రధానమంవూతిగా రాజకీయాల్లో తలమునకలుగా వుంటూ కూడా తీరిక దొరికినప్పుడల్లా సాహిత్య వ్యవసాయం సాగించారాయన. తెలుగు ఉర్దూ, హిందీ, మరాఠీ వంటి భాషపూన్నో తెలిసిన పి.వి. 1945-52 మధ్యకాలంలో మిత్రుడు పాములపర్తి సదాశివరావుతో కలిసి వరంగల్లు నుంచి ‘కాకతీయ’ అనే పత్రికను నడిపారు. మీరు చదువుతున్న ఈ కథ (1949లో) ఆ పత్రికలోనే ‘విజయ’ కలంపేరుతో అచ్చయింది. మళ్ళీ ఈ కథను ‘తెలంగాణ తొలితరం కథలు’ నుంచి పునర్ముద్రిస్తున్నాం.

కాగా, పి.వి. ఇంగ్లీషు, తెలుగు, హిందీల్లోనూ రచనలు చేశారు. తన ఆత్మ కథారూపమైన ‘ఇన్‌సైడర్’ అన్న నవలను ఇంగ్లీషులోనే రాశారు. అది తెలుగులోకి అనువదింపబడింది కూడా. విశ్వనాథ ‘వేయిపడగలు’ నవలను ఆయన హిందీలోకి ‘సహవూస్‌ఫణ్’ పేరుతో అనువదించారు. ఇక కథల విషయానికి వస్తే, 1943లో బెంగాల్ కరువును గురించి ఇంగ్లీషులో ఆయన వ్రాసిన ఒక కథ చాలామంది సాహితీవూపియులను ఆకర్షించింది. అట్లే, దేశ విభజన నాటి హిందూ ముస్లింల హింసాకాండను నిరసిస్తూ ఆయన ఇంగ్లీషులోనే ‘బ్లూసిల్క్ సారీ’ అనే గొప్ప కథను కూడా రాశారు.

Wednesday 11 April 2012

ఫాక్షన్ మంటల్లో రగులుతున్న రాజోలిబండ

  (Top: Damaged RDS gates, bottom sukesula project)


రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) ప్రాజెక్టు మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు మండలాలకు సాగు,త్రాగు నీరందించేందుకు ఉద్దేషించిన ఒక చిన్న ప్రాజెక్టు. ఆర్డీఎస్ ప్రాజెక్తుకు దిగువన కొంత దూరంలో ఉన్న సుంకేసుల బ్యారేజీ కేసీ కెనాల్ ద్వారా కర్నూలు, కడప జిల్లాలకు నీల్లిస్తుంది. ఎగువన ఉన్న ఆర్డీఎస్ ప్రాజెక్టు గేత్లద్వారా నీల్లు క్రిందకి వచ్చి సుంకేశులలో చేరుతాయి. అయితే అడపా దడపా కర్నూలు నుండి ఫాక్షనిస్టు మూకల అధ్వర్యంలో అక్కడి రైతులు దౌర్జన్యంగా గేట్లు బద్దలు చెయ్యడంతో పాలమూరుకు రావల్సిన నీరు మొత్తంగా  సుంకేశుల చేరుతుంది.

మొదట ఆర్డీఎస్ ప్రాజెక్టు కట్టినప్పుడు అప్పటి మూడు రాష్ట్రాలు కర్ణాటక్ అ, హైదారాబాద్, ఆంధ్ర రాష్ట్రాలమధ్య కుదిరిన ఒప్పందం ద్వారా ప్రాజెక్టులో 1.2 టీఎంసీ నీరు కర్ణాటకకు, మిగతా నీరు మహబూబ్ నగర్, కర్నూలులకు సమానంగా లభించేలా రూపకల్పన జరిగింది. ప్రాజెక్టు పూర్తయేసరికి ఆంధ్ర, తెలంగాణలు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డంతో పెత్తనం ఆంధ్ర నాయకులకు చేరడంతో పాలమూరు వాటా తగ్గిపోయింది. ప్రభుత్వ కోరిక మీదట బచావత్ ట్రిబ్యునల్ ఆర్డీఎస్కు కేవలం 17.1 టీఎంసీలు కేటాయించి కేసీ కెనాల్‌కు మాత్రం 39.9 టీఎంసీలు కేటాయించింది. ఆ తరువాత కర్నూలు నాయకుల అధ్వర్యంలో ఆర్డీఎస్ గేట్లు పగలగొట్టడం ద్వారా కేసీ కెనాల్ తనకు కేటాయించినట్లు 39.9 టీఎంసీలు కాకుండా 50 నుంచి 60 టీఎంసీలు కొల్లగొడుతుంటే ఆర్డీఎస్‌కు మాత్రం 6 టీఎంసీలు కూడా అందడం లేదు.

గత పదిహేను సంవత్సరాలలో మూడు సార్లు కర్నూలు ఫాక్షన్ నేతలు ఆర్డీఎస్ తూములను దౌర్జన్యంగా బద్దలు కొట్టించారు. పదేళ్ళక్రితం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి టీడీపీ ఎంపీ, ఫాక్షన్ నేత అయిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అధ్వర్యంలో దుండగులు రాత్రిపూట ఆర్డీఎస్ తూములు బద్దలు కొట్టారు. ఆతరువాత చాన్నాల్లు నీల్లు దిగివకు వెలుతూ పాలమూరు రైతులకు నష్టం జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక ఇరుప్రాంతాల నాయకులమధ్య సయోధ్య కుదిరించి పగిలిపోయిన గేట్లకు ఇనుప షట్టర్లను బిగించాడు.

2010 ఆగస్టు పదమూడు నాడు అర్ధరాత్రి మరోసారి మూడో స్లూయిస్ గేటును దుండగులు ధ్వంసం చేశారు. ఈసారి మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఈపని చేయించినట్లు తెలిసింది. ఆఘటన జరిగిన తరువాత సీమ ఫాక్షనిస్టు నేతలు భూమా నాగిరెడ్డి, బాలనాగిరెడ్డి పబ్లిగ్గా గేట్లు బిగించినట్లయితే మల్లీ ధ్వంసం చేస్తామని ప్రకటించారు. అయినప్పటికీ ఈపక్షపాత ప్రభుత్వం వారిపై ఎలాంటి చర్య తీసుకోకపోవడం గమనార్హం. ఒకపక్క ప్రభుత్వ అధికారిక పక్షపాత ధోరణి ద్వారా కేటాయింపుల్లో అన్యాయం, మరోపక్క ఫాక్షన్ నేతల దౌర్జన్యంద్వారా కేటాయించిన నీల్లు కూడా అందకపోవడం జరుగుతూ దశాబ్దాలుగా పాలమూరు వాసులు ఆర్డీఎస్ ప్రాజెక్టు వాటాల్లో మోసపోతూనేఉన్నారు.

తెలంగాణను అడ్డుకునేందుకు హైదరాబాదులో అల్లర్లు


హైదరాబాదులో హిందువులూ ముస్లిములూ ఎన్నో ఏల్లుగా కలిసి ఉంటున్నారు. ఒకరి పండగలలో మరొకరు ఆనందం పంచుకుంటారు. గుల్లమధ్యలో దర్గాలు ఉంటాయి. హిందువులూ, ముస్లిములమధ్య మతపరమయిన విద్వేషాలు ఇక్కడ పెద్దగా ఎప్పుడూ లేవు. అప్పుడప్పుడూ చెదురు మదురు సంఘటనలు జరిగినా ప్రజలు ఎప్పుడూ సమ్యమనం పాటించేవారు. ఎప్పుడయినా ఇక్కడ అల్లర్లు జరిగినపుడు సాధారణంగా దానికి కారణం ఎవరో రాజకీయ లబ్దికోసం విద్వేషాలు రగిల్చడం వలననే.

1991లో ఇక్కడ పెద్ద ఎత్తున అల్లర్లు జరిగాయి. చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న ఆసమయంలో విపరీతమయిన ఘర్షణలతో పాతబస్తీలో మాత్రమే కాక సికందరాబాదులో కూడా అల్లర్లు జరిగాయి. ఒక్కరోజు ఒక్క వాడలో జరిగిన అల్లర్లలో వందమందికి పైగా మరణించారు. అయితే ఈఅల్లర్లు మామూలు మతకల్లోహాలు మాతేం కావు. ఒకే బస్టాపులో ఒక హిందువు ఒక ముస్లిమూ నుంచుంటే ఇద్దరికీ ఒకేమూకనుండి కత్తిపోట్లు జరిగాయి. ఒకేపేటలో ఒకేసారి హిందూ కుటుంబాలూ, ముస్లిం కుటుంబాలు కూడా కత్తిపోట్లకు గురయ్యాయి. అవి ఎవరూ చేపించారు, ఎవరు చేశారు అనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ముక్యమంత్రి పదవి నుంచి చెన్నారెడ్డిని తప్పించడం కోసం మన మహానేత కడపనుంచీ, అవనిగడ్డనుంచీ కిరాయిగూండాలను దించాడని అందరికీ తెలిసిందే. ఈవిషయాన్ని స్వయంగా అప్పటి  ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు.

ఇప్పుడు మల్లీ హైదరాబాదులో ఘర్షణలు మొదలయ్యాయి. కారణం ఎవరో హనుమాన్ గుడిలో ఆవు కాలిని వెయ్యడం, విగ్రహానికి పచ్చరంగును పులమడం. ఆతరువాత వెంటనే కాచుకుని కూచున్నట్టు రెండు వర్గాలు రాల్లు రువ్వుకోవడం. హనుమంతుని గుడిని పనిగట్టుకుని అపవిత్రం చేద్దామనే ఆలోచన ఎన్నడూ లేనిది ఇప్పుడు చేద్దామనే ఆలోచన ఎవరికి మాత్రం కలుగుతుంది? అదికూడా మొన్నిమధ్యనే సంగారెడ్డిలో సీమాంధ్రనాయకుల తొత్తు చేయించినట్లు తెలియబడ్డ అల్లర్లు జరిగిన కొద్దిరోజుల్లోనే ఇక్కడ ఎందుకు జరిగాయి?

దీనికి కారణం తెలుసుకోవడం పెద్దకష్టమేమీ కాదు. తెలంగాణ వస్తే మతఘర్షణలు జరుగుతాయని దుష్ప్రచారం చేస్తున్న సీమాంధ్ర నేతలు తమప్రచారం నిజమని నిరూపించి తెలంగాణను అడ్డుకోవడం కోసం చేసినపని అనేది బహిరంగరహస్యం. ఉపేన్నికల్లో మహబూబ్నగర్లో బీజేపీ గెలవడంతో అల్లర్లు సృష్టించి దీనికీ బీజేపీఏ కారనమని చెప్పడం కోసం చేసిన ప్రయత్నమిది.

హైదరాబాదులో భూములను కబ్జాలు చేసి ఆకబ్జాలను కాపాడుకోవడంకోసం సమైక్యనాటకమాడుతున్న నేతలు హైదరాబాదులోకి సీమ నుండి ఫాక్షనిస్టు రౌడీలను తెచ్చి రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్న వీరు ఇప్పుడు మతఘర్షణలకు తెరలేపుతున్నారు. కుట్రలోతో తెలంగాణను అడ్డుకునేప్రయత్నం చేస్తున్న ఈమోసగాల్ల ఆటలు ప్రజలకు ఇప్పటికే తెలిస్రావడంతో వీరి ఆటలు చెల్లడం లేదు. వీరు విద్వేషాలు రగిలించినా ప్రజలు మాత్రం వీరి మోసపు ఎత్తుగడలనుంచి అప్రమత్తంగానే ఉన్నారు. ఇలాంటి నీచపు ఎత్తుగడలను ఈమోసపు నేతలు ఇకనయినా మనుకోకపోతే ప్రజలచేతిలో వీరికి గుణపాఠం తప్పదు.

Monday 9 April 2012

చేగొండీ! ఎందుకీ తొండి?




చేగొండి రామజోగయ్య అనబడే విశ్రాంత బ్యాంకు అధికారి ఈమధ్య  విశ్రాంతి లేకుండా ఆంధ్రప్రభలో ఎడాపెడా తెలంగాణపై విషాన్ని గుప్పిస్తున్నాడు. ఇతని రాతల్లో ఒక అర్ధం, పర్ధం ఉండదు, ఒక్క విషయంపై నిలకడగా తార్కిక వివరణ ఇవ్వలేడు, ఎంతసేపూ ఉద్యమాన్ని ఎలా వెక్కిరిద్దామా అన్నట్టు నంగి మాటలతో వ్యంగ్యాన్ని గుప్పించడం తప్ప పస ఉన్న వాదనలు ఒక్కటీ ఉండవు. ఈయన చత్తరాతలను కూడా ఆంధ్రప్రభలో ప్రచురిస్తాన్నరంటే అసలు ఆంధ్రప్రభ పరిస్థితి ఎంత దయనీయంగా ఉన్నదో అనిపిస్తుంది.

ఇంతకూ ఈయన రాతల సారాంశం ఏమిటీ అంటే "విభజనవాదం విషతుల్యం, రాష్ట్రాన్ని విభజిస్తే అది దేశ సమగ్రతకే ముప్పు, రాష్ట్రాన్ని విభజిస్తే రాష్ట్రం రెండు ముక్కలు కాదు, యాభై ముక్కలవుతుంది, అందులో తెలంగాణాయే ముప్పై ముక్కలవుతుంది(?!)". ఎందుకూ, ఎలా అన్న వివరణలు ఆరాతల్లో మచ్చుకు కూడా కనపడవు. ఎందుకు ముప్పై ముక్కలవుతుందీ అంటే చేగొండి గారు తమ బ్యాంకు అధికారి అనుభవంతో చెప్పారు గనక మనం ఒప్పుకుని తీరాల్సిందే.  చేగొండి మాష్టారు గారూ, ఇప్పుడు తెలంగాణ ఏకారణాలతో విడిపోవాలనుకుంటుందో సరిగ్గా అదేకారణాలవల్ల తమరి ఆంధ్రా ప్రాంతం మద్రాసు రాష్ట్రం నుండి విడిపోవడం కోసం ఉద్యమించి తమరి భాషలో దేశంలో మొట్టమొదటి వేర్పాటువాదానికి తెరలేపింది. ఎంత విషతుల్యమైందో కదా మీఆంధ్రరాష్ట్ర ఏర్పాటు కోరిక?

అసలు నిజంగా ఒక రాష్ట్రం విడిపోతే దేశసమగ్రతకే ముప్పు వస్తే, రాష్ట్రవిభజన నిజంగా అంత ప్రమాదకరమయిందే అయితే మీరు చెయాల్సింది తెలంగాణ రాష్ట్రాన్ని ఆపడం కాదు, అంతప్రమాదానికి కారణమయిన రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడును ఎత్తివేయడంకోసం మీరు ఉద్యమించాలి, ప్రయత్నించండి మరి. యాభై ఏల్లు ఉద్యమిస్తే ఒక్క రాష్ట్రం ఏర్పాటు కాలేదు గానీ, విభజిస్తే ఈరాష్ట్రం గాజుగ్లాసును నేలకేసి కొడితే పగిలినట్లు ముక్కలవుతుందా? ఆహా, ఏం తెలివండీ తమరిది?

ఇటీవల ఈమహానుభావుడి కలంలోనుంచి జాలువారిన మరో ఆణిముత్యం ఏమిటంటే "విడిపోతే తెలంగాణ ప్రజలు నష్టపోతారట, ఆంధ్రా ప్రజలకు లాభమట, అయినా వారు పెద్దమనసుతో తెలుగుజాతి సమగ్రతకోసం విభజనను అడ్డుకుంటున్నారట". ఆహా, ఎంత తెలివీ? ఇంతకాలం ఈమాత్రం తెలియకుండానే తెలంగాణ ప్రజలు విడిపోదామనుకుంటున్నారే. ఏదయితే అదయింది, మీరిలాగే రాస్తూ ముందుకుపోండి..మీరాతలను చదివి సీమాంధ్ర జనం తమకు రాష్ట్రవిభజన వలన జరిగే లాభాలను తెలుసుకుని విభజనకు ఒప్పుకుంటే మరీమంచిది.
 
ఈయన తనవ్యాసంలో విభజన జరిగితే తెలంగాణకే నష్ట ం అంటూ రాసిన ఎనిమిది పాయింటలో కనీసం ఒక్కటి కూడా చర్చించడం కూడా అనవసరమైనటువంటి చత్త రాతలు. దేశంలో అధిక సంఖ్యాకప్రజలు విభజనకు వ్యతిరేకమత.. అది ఈఅయనే కనుక్కున్నాడు మరి.  హైదరాబాదులో నలభై ఐదుశాతం మంది సీమాంధ్రులేనంట..ఇరవై శాతం భాషాపర మైనారిటీలు, మరో ఇరవై శాతం మతపర మైనారిటీలూనూ. ఇదీ ఈయన లెక్క. అంటే హైదరాబాదులో తెలంగాణ ప్రజలు కేవలం 15 శాతం..మరి ఈమాత్రానికే విభజన జరిగితే మాకు రక్షణ ఉండదూ, గట్రా, కాబట్టి హైదరాబాదును యూనియన్ టెర్రిటరీ చెయ్యాలీ అని నసుగుతున్నారెందుకంట?

చివరగా ఈయన వివరించిన గొప్పసందేషం ఏమంటే విభజన జరిగితే సీమాంధ్రులు అసాధ్యులు, నదీజలల్లో ఎక్కువ వాటా కొట్టేస్తారూ, కనుక తెలంగాణకు పెద్దలాభం ఉండదూ అని. మరి విడిపోయి వేరే రాష్ట్రంలో ఉంటేనే వీరి అసాధ్యం ఇలాగుంటే ఒక్కరాష్ట్రంలో ఉన్నప్పుడు ఈఅసాధ్యులు ఇంకెంత వాటానొక్కేయాలి? అందుకేగదా ఇప్పుడు ఒక్కనీటిచుక్క గూడా విదిల్చడం లేదు?

నీరుపల్లమెరుగుతుంది అంటూ జలదోపిడీని సమర్ధించుకునే వీరు పైరాష్ట్రాల నీటివాటాలో మాత్రం ఆ సూత్రాన్ని అమలు చెయ్యరు. పైగా స్వభాషీయులు దోచుకున్నా ఫరవాలేదంటకానీ పైరాష్ట్రం వాన్ని నిలదీయాలట. ఆహా చేగొండి! ఏందండీ ఈతొండి?