Sunday 15 April 2012

జయ జయహే తెలంగాణ



prayanam‘ఉపాధ్యాయ సమ్మె వాయిదా. నేటి నుండి మోగనున్న బడిగంటలు.’
పేపర్లలో ఈ వార్తను హెడ్డింగుల్లో చూసిన నళిని మరింత ఢీలా పడింది.
నిజానికి బడికి వెళ్లడం అంటే ఎంతో ఉత్సాహం నళినికి. కానీ ఇయ్యాల, ఈ స్థితిలో వెళ్లడం అంటే ఎందుకో మనసొప్పడం లేదు.
దబదబా వంట చేసింది గని ఏడున్నయో... టిఫిన్ బాక్స్‌లు దొరుకుత లేవు.
సమ్మె జెయ్యవట్టి నెల రోజులాయె మరి.
తెలంగాణ అటో ఇటో తేలకనే పాయె!
ఆఖరికి సమ్మె బంద్ వెట్టిరి. తెలంగాణ రాష్ట్రం ఇవ్వక పోయిరి.
మనసునిండా ఇవే ఆలోచనలు....అందుకే అన్యమనస్కంగా పనిచేస్తోంది నళిని.
పేపర్లు ఆడ పారేసి ‘బడికి వెళ్లాలె...’ అనుకుంటూ, ఆ ఆలోచనలతోనే భర్త వివేక్‌కు ప్లేట్‌లో ఇడ్లీ పెట్టింది.
‘‘అల్లం చట్నీలో బెల్లం తక్కువయింది’’ అనుకుంటనే తింటున్నడు వివేక్. తింటూ, ‘‘ఏమాయె నళినీ! ఈసారి తప్పకుంట తెలంగాణ వస్తదంటివి కదా’’ అన్నడు వివేక్.
‘‘అవును అనుకుంటిని’’ బాధగానే చెప్పింది నళిని.
‘‘ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలవుతుందని చిదంబరం అనంగానే ఆంధ్ర నాయకులు ఏకమై రాజీనామాలు జేసిరి. మన నాయకులు ఏకమై ప్రజలతో పోరాటం చేస్తారనుకున్న. వాళ్లిట్ల చతికిల బడుతరని నేనేమన్న కల గంటినా’’ అన్నది. అనుకుంటనే, బోళ్లన్నీ అటూ ఇటూ జరిపి పెరుగు డబ్బా, కూర డబ్బా దొరకవట్టింది. దబదబా ఇంత అన్నం కూరల్ని బాక్సుల్లో పెట్టుకుని, బ్యాగు భుజానికి తగిలించుకుని భగత్‌నగర్‌లో ఆటో ఎక్కి కల్పన హోటల్ దగ్గర దిగింది నళిని.
మారుమూల గ్రామాలకు వెళ్ళే ఆటోలు అక్కడే చక్కర్లు కొడతయి.

నళిని రోజూ పోయే ఆటోను గుర్తు పట్టాలంటే ముందు డ్రైవర్‌ను, ప్రయాణీకులను చూడాలె.
కానీ, ఆ అవసరం లేకుండనే, ఓ ఆటోల్నుంచి రమ్మని తన దోస్తులు చెయ్యి ఊపుతునే ఉన్నరు.
అవును మరి. ఆ ఆటోలో ఉన్నవాళ్లు దాదాపూ దోస్తులే. దాదాపూ అందరూ రోజూ తనతో ప్రయాణం చేసేటోళ్ళే. ఆత్మీయతను పంచేటోళ్ళే.
రూపాయికి కిలో బియ్యం, స్వశక్తి రుణాలు, వృద్ధాప్య పెన్షన్‌లు, తెలంగాణ ముచ్చట్లు, బంద్‌లు, టీవీ వార్తల్లోని అంశాలు...ఇవే వాళ్ల చర్చల్లోని రోజువారీ ముఖ్యాంశాలు.
‘‘జరుగుండ్రి జరుగుండ్రి! మా వూరి మేడమ్ కూసుంటది’’ కాంతమ్మ అందరిని సెల్పింది.
భూదమ్మ, భారతి, స్వరూప, కనకయ్య, కాంతమ్మ ఎప్పటిలాగే ఆటోలో కూచుని ఉన్నరు.
ఆటో కమాన్ దాటింది.
పాల డబ్బాలు గల గల శబ్దం చేస్తున్నయ్.
డబ్బాలు అనుకోకుండా కాళ్లకు తాకితే మొక్కుతరు. అవును మరి. వాళ్ల ఇసిలన్నీ దేవుళ్ల లెక్క సూసుకుంటరు.

భూదమ్మయితే ఖాళీ పాల సీసాల గంపను కింద పెట్టేది కాదు. పసిపిలగాని లెక్క తొడమీద పెట్టుకుంటది.
ఆటో కోతి రాంపూర్ పెట్రోల్ బంక్ దగ్గర ఆగింది.
లింగాపూర్ మాజీ సర్పంచ్ బాలరాజు ఎక్కిండు. వెంట ఆయన వియ్యంకుడు లింగస్వామి ఉన్నడు.
‘‘మేడం నెల రోజులాయె...కనపడక. ఇవాల్టి నుండి బడి షురువైన అడిగిండు బాలరాజు.
మళ్లీ మనస్సు కలుక్కుమన్నది.
ఆయన ఊకోలేదు. ఇంకా ఇట్లడిగిండు... ‘‘తెలంగాణ ఏమైనట్టు? గింతమంది గిన్ని రకాలుగా బందు సప్పుడు జేత్తలేరు. ఇత్తరనక పోయిరి. ఇయ్యమనక పోయిరి.’’ తనలో తాను మాట్లాడుకున్నట్టే అంటున్నడు బాలరాజు.

‘‘కుల సంఘపోల్లు, ఆటోలోల్లు, మహిళాక్షిగూపులు, దుకాణాదారులు, ఉద్యోగస్తులు, బస్సు కండక్టర్లు, డ్రైవర్లు, కార్మికసంఘాలు, కరెంటోళ్లు, విద్యార్థులు, పిల్లలు, పెద్దలు ముసలోల్లు తీరొక్కలు రోడ్డెక్కిరి.....’’ నోటికి కొంగు అడ్డం పెట్టుకునే అట్లే అంటున్నది కాంతమ్మ.
తలా ఒక మాట అంటనే ఉన్నరు.
ఆ మాటలకు ఇంకొకలు స్పందనగా ఉంకో మాట జోడిస్తున్నరు.
‘‘అయినా...గా సోనియమ్మకు తెలుగే రాదట కదా? మన తెలంగాణ బతుకుల సంగతి ఆమెకు ఏం తెలుస్తది’’ అన్నది భూదమ్మ.
‘‘ సోనియమ్మకు తెల్వకపోతె పోనీగని..మనం ఓట్లేసి గెలిపిచ్చుకున్నోళ్లకు ఎందుకు తెల్త లేదవ్వా?’’ అనవట్టింది భారతి.
‘‘రోజు పేపర్ల, టీవి వార్తలల్ల సూత్తనే ఉన్నం. నాయకుల ముచ్చట జూడబోతే ఎన్ని నెలలయినా తెలంగాణ ఇచ్చేటట్లు కనబడత లేదు.
కమీటిలు అన్నరు. ఇగొచ్చె తెలంగాణ, అగొచ్చె తెలంగాణ అన్నరు. రేపే తెలంగాణ తీర్మానం అన్నరు. తెలంగాణ కోసమే మీటింగ్‌లన్నీ అన్నట్టు జేసిరి. ఇప్పుడేమో తెలంగాణ ముచ్చటే పక్కకు పెట్టిరి. మనం ఇక్కడ సమ్మె జేస్తాంటే ‘ఢిల్లీల ఊదు కాల్తలేదు. పీరి లేత్త లేదు’’ చెప్పింది సత్తెమ్మ.
నళిని మౌనంగ వింటున్నది.

తలా ఒక తీరుగా మాట్లాడుతుండగా, ఆటోలో చెక్కమీద కూసున్న కనకయ్య మాత్రం బీరి పోయి కనిపించిండు. బొక్కకు చెటాక్ మాంసం లేదు. కనుగుడ్లు లోపలకు పోయినయి. రోడ్డు దిక్కే సూత్తాండు.‘‘ఏందే నాయనా సప్పుడు జేత్తలేవు?’’ అన్నది స్వరూప.
‘‘తమ్ముడు మస్కట్ పోయిండు బిడ్డా! నెల రోజులాయె. జాడలేదు. పత్తా లేదు. ఫోన్‌ల మాట్లాడలేదు. నా మనమరాలు వాళ్ల బాపును ఇడ్చిపెట్టి ఉండకపోవు. బజారు దిక్కు చూపిచ్చుకుంట పులుకు పులుకున ఏడ్పు....’’ అని చెప్పి కండ్లళ్ల నీళ్లు తుడ్సుకున్నడు. క్షణం తర్వాత గొంతు పెగుల్చుకుని, ‘‘...ఏసిన రెండు బోర్లు గూడ ఫెయిలయినయ్. అప్పుల పాలైతిమి. పంటలు లేవు. బతుకు దెరువు లేదు....మన నీళ్లు మనకు గాకుంట చేసినోళ్లను నడి బజార్ల నిలబెట్టాలె బిడ్డా!’’ అంటూ కనకయ్య ఎత చెప్పిండు. అంత నిస్సహాయతలోనూ పోరాట మార్గమూ చెప్పిండు.
ఆటో అల్గునూర్ క్రాసింగ్ దగ్గర ఆగింది. బక్క పల్చటి పిలగాడు ఎక్కిండు. ఎరుపు వన్నె. చూసిన మొకమే. వెనుకకు తిరిగి చూస్తూ ‘‘బాగున్నారా మేడమ్’’ అన్నడు.
‘‘ఆఁ....సతీషా......?’’
‘‘అవును మేడమ్ సతీష్‌నే...’’
‘‘ఏం చేస్తున్నవ్ బాబూ? అమ్మనాన బాగున్నరా? నాన రైస్ మిల్లుల్నే పనిచేస్తున్నడా?’’ అడిగింది నళిని.
‘‘హైవూదాబాద్‌లో ఉంటున్న మేడమ్. ఎం.యస్.సి. అయిపోయింది. గ్రూప్సు ప్రిపేర్ అవుతున్న.’’
‘‘ పట్టుదలతో చదువు. మంచి జాబ్ సంపాదించుకో...’’ చెప్పింది నళిని,
‘‘ ఆ...ఏం జాబ్‌లు మేడమ్. ఎంత చదివినా ఏం లాభం లేదు మేడమ్’’ అన్నడు. ‘‘మొన్న జరిగిన గ్రూపు వన్ పరీక్ష రాసిన. రాత పరీక్షలో మంచి మార్కులు వచ్చినయ్. జాబ్ గ్యారంటీ అని మిత్రులు చెప్పిండ్రు. ఉత్సాహంతో ఇంటర్వ్యూకు గూడ పోయిన. అడిగిన అన్ని ప్రశ్నలకూ జవాబులు చెప్పిన. రెండు రోజుల తర్వాత లిస్టు పెట్టిండ్రు. అండ్ల నా పేరు లేదు మేడమ్...రాత పరీక్షలో నా కంటే తక్కువ మార్కులు వచ్చినోళ్ల పేర్లు ఉన్నయ్’’ బాధతో చెప్పిండు సతీష్.
ఆటోలో అందరూ సతీష్ చెప్పేది వింటున్నరు.
‘‘మన తెలంగాణ మంత్రులు సెక్రె అటెండర్ల లెక్క...గంతే. ఆంధ్రా మంత్రులేమో బంధువులకు ఉద్కోగాలిప్పిచ్చుకునుడు. ఇంటర్వ్యూల ఎక్కువ మార్కులు వేయించుకునుడు...ఉన్న ఉద్యోగాలన్నీ దొబ్బుడు...గిదే పనాయె.. ’’ అప్పటిదాకా మౌనంగా ఉన్న సర్పంచ్ వియ్యంకుడు అన్నడు. ఆ మాటకు ‘‘నిజమే అన్నా...’’ అన్నడు సతీష్.
ఇంతల ఆటో మానకొండూర్‌ల ఆగింది. సతీష్ నమస్కారం చెప్తూ దిగి పోయిండు.
ఆటో గతుకుల రోడ్ మీద ఎత్తేసుకుంటూ స్పీడ్‌గా పోతూనే ఉన్నది.
లోపల ఉన్న వాళ్లు కొండపల్లి బొమ్మలు ఊగినట్లుగా కదులుతున్నరు.

‘‘నాయకులందరూ ఒక్కటే, నీ పార్టీ లేదు. నా పార్టీ లేదు. రాత్రికి రాత్రి మొఖం చూడద్దు అన్నట్టు తిట్టుకుంటరు. తెల్లార్తె ఒక్కటైతరు. చావుల కాడ, పెండ్లిల్ల కాడ పక్కపక్కనే కూసుంటరు. నిజంగ మనమందరం నాయకులతోనే మోసపోతున్నం. మనం ఓట్లేసి గెలిపించినోళ్లే తెలంగాణకు అడ్డు. నాయకులందరూ మనతో కలిసి రాకపాయే....’’ విచారంగా అన్నడు బాలరాజు.
‘‘ఇగో ఇంటాన్నావా నోయ్ లింగస్వామి! తెలంగాణకు అడ్డుపడ్డ నాయకులను ఊళ్ళె అడుగు నియ్యద్దు. కుర్చీలు ఎయ్యద్దు. దండ లెయ్యద్దు’’ వియ్యంకుడికి బాలరాజు హెచ్చరికగా చెప్తనే ఉన్నడు.
ఆటోలో కూసున్నోళ్లంతా ఆ మాటల్ని వింటనే ఉన్నరు.

అందరి మనసులోనూ గదే ఉందన్నట్టు సప్పుడు జేయలేదు.
ఇగ ఆటో శ్రీనివాసనగర్‌లో ఆగింది.
స్వరూప గంప, పాల డబ్బాలు పట్టుకొని దిగింది.
ఇంకో ఐదు నిమిషాలకు నళిని పాఠశాల దగ్గర ఆటో ఆగింది.
ఆమె ఆటోలనుంచి దిగి గేటు లోపలికి అడుగు పెట్టిందో లేదో, ‘‘జయ జయహే తెలంగాణ! జననీ జయకేతనం’’ అన్న తెలంగాణ జాతీయగీతం విద్యార్థుల గొంతున మధురంగా వినబడుతున్నది.
ఆ గీతపు ఉత్తేజమో, లేకపోతే ఆ పాటను రేపటి పౌరుల గొంతుల్లోంచి వినడమో ఏమో గానీ నళినిలో గొప్ప ఆశను కలిగిస్తుంటే, ఇక ఆ టీచర్ ఉత్సాహంగా బళ్లెకి అడుగు 
~ ఏదునూరి రాజేశ్వరి

1 comment:

  1. పరకాల ప్రభాకర్ కొత్త ప్లాన్‌లో ఉన్నాడు. కోస్తా ఆంధ్రలో జగన్ గెలిస్తే పక్కా సమైక్యవాది అయిన జగన్ పార్టీ గెలిచింది కనుక కోస్తా ఆంధ్రలో సమైక్యవాదం బలంగా ఉంది అని పరకాల ప్రభాకర్ ప్రచారం చెయ్యాలనుకుంటున్నాడు.

    ReplyDelete

Your comment will be published after the approval.