Friday 16 November 2012

సీమాంధ్ర పత్రికల కుట్రను అర్థం చేసుకుందాం. కోదండరాం వెంట నిలబడుదాం


జనంసాక్షి ఎడిటోరియల్

సీమాంధ్ర పత్రికలు మరో కుట్ర పన్నాయి. వీలున్నపుడల్లా తెలంగాణ ఉద్యమంపై దుష్ప్రచారం చేసే సీమాంద్ర మీడియా ఈ సారి ఏకంగా ఉద్యమ సారధిపైనే తమ కుట్ర బాణాలను ఎక్కుపెట్టాయి..తెలంగాణ ఉద్యమాన్ని తారాస్థాయికి చేర్చడంలో కీలకభూమిక పోషించిన తెలంగాణ ఉద్యమ రథసారధి కోదండరాంపై దుష్ప్రచారానికి తెరతీశాయి..తెలంగాణ కోసం రాజీలేకుండా పోరాడుతున్న ఒకే ఒక్క గొంతుక కోదండరాం సార్‌పై సీమాంధ్రుల పత్రికలు కత్తికట్టాయి. తన జీవితంలో చాలాకాలం పౌరహక్కుల రక్షణ కోసం, స్వేచ్ఛా, సౌభ్రాతృత్వం పోరాడిన ఓ వ్యక్తి అగ్రవర్ణమట..ఎవరు ఏకులంలో పుట్టారన్న దాని కంటే ఏ ప్రజల వైపు పోరాడుతున్నారు, ఆ వ్యక్తి నినాదమేంది, ఏ శక్తులతో కలిసి పనిచేస్తున్నాడు, ఏప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడన్నది ముఖ్యం. ఆలోచనలో, ఆచరణలో తను ఏ సిద్ధాంతానికి మద్ధతుగా పోరాడుతున్నదే ప్రస్తుతం.  అతని ఆచరణ, విధివిదానాలను బట్టి అతను ఏ వర్గ శత్రువో, ఏ వర్గ మిత్రువో అంచనా వేస్తాం. ఆ శక్తులతో కలిసి ఏ మేరకు పనిచేయాలో నిర్ణయించకుంటాం. నిజానికి కోదండరాం అసలు పేరు కోదండరాం రెడ్డి. అంబేద్కర్‌ సభలలో, దళిత బహుజన పోరాటాలు ఉవ్వెత్తున సాగుతున్న రోజులలో మీపేరు చివర రెడ్డి ఉంది కదా అని ప్రశ్నించగానే వెంటనే రెడ్డి అనే పదాన్ని తొలగించుకొని ఇక నుంచి తనను కోదండరాంగానే పిలవాలని అందరికీ విజ్ఞప్తి చేశాడు. ఆయన జీవిత కాలంలో ఎక్కువ కాలం పనిచేసింది కూడా దళిత, బహుజన వర్గాల కోసమే..పౌరహక్కుల సంఘంలో మనిషికి మాట్లాడే, పోరాడి స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు, జీవించే స్వేచ్ఛకోసం ఆయన పోరాడారు..ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారు. ఆయన పేరు కన్నా, తన పేరు చివరలోని రెడ్డి అనే పదం కన్నా దళితుల కోసమే ఎక్కువ ఆలోచించాడు.  ఆయన గతానికి, ప్రస్తుతానికి పెద్దగా తేడా ఏమీ లేదు..కోదండరాం రెడ్డిగా ఉన్నా, కోదండరాం గా ఉన్నా ఆయన పోరాడింది దళితులు, పౌర హక్కుల కోసమే..అసలు ఆయన ఏకులంలో పుట్టాడన్న విషయం బహుశా ఆయనే మర్చిపోయాడేమో..అయినా ఓట్లు, నోట్ల కోసమే పాకులాడే నాయకులు ప్రతిసారి కోదండరాం రెడ్డి అని గుర్తు చేస్తే తప్ప ఆయన కులం ఆయనకు గుర్తు రాకపోవచ్చు. అయినా ఆయన ఏనాడు తన కులం పేరు చెప్పుకొని రాజకీయాలు చేయలేదు..తెలంగాణ ఉద్యమాన్ని ఎలా నడపాలి..తెలంగాణ రాష్ట్రాన్ని ఎలా సాధించాలో అన్న ఆలోచనలే ఆయన చేస్తుంటాడు..నాలుగు కోట్ల ప్రజల ఆశ, శ్వాస అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించేందుకు ఏం చేయాలో అని ఉద్యమ కార్యాచరణను రచించే కోదండరాంను ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని తన రాజకీయాల కోసం వాడుకొనే పలువురు రాజకీయ నాయకులు పలువురు టార్గెట్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏ కులంలో పుట్టినా అణగారిన ప్రజల వైపు నిలబడడం, వారి పోరాటాలకు మద్ధతు, వారి ఉద్యమాల్లో పాల్గొనడం, వారి వెంట నడవడం, వారితో భుజం,భుజం కలిపి వారితోపాటు పోరాటాలలో పాల్గొనడం, వారి కోసమే జీవించిన వారిని పీడిత ప్రజలకు మిత్రులు కాదని ఎలా చెప్పగలం. ప్రొఫెసర్‌ కోదండరాం కూడా అంతే. కారంచేడు, లక్ష్మింపేట ఘటన వరకు కోదండరాం దళితులుల వైపు మాట్లాడారు. దళితులుగా పుట్టి నామోషీగా పేరు చివర రెడ్డి తగలించికున్న  వారు కొందరు కోదండరాంను ఒంటరి చేసి తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయాలన్న ఓ కుట్ర తెలంగాణ ఉద్యమ నాయకత్వం దళితుల వ్యతిరేకుల చేతుల్లో ఉందని చూపించేందుకు చేసే సీమాంధ్ర పత్రికల కుట్రలను మనం అర్థం చేసుకోలేమా…ఈ పత్రికలు కారంచేడులో దళితుల్ని చంపిన సామాజికవర్గానికి చెందిన వారి చేతుల్లో ఉన్న పత్రికలు. నిజానికి కట్టుకథలు, పెట్టుబడులకు పుట్టిన విష పుత్రికలు ఈ పత్రికలు. తమ విషాన్ని మనపై విరజిమ్మేందుకు ఈ పత్రికలు ప్రయత్నిస్తున్నాయి..తమ రాతలతో కోదండరాంను దళిత వ్యతిరేకంగా ప్రచారం చేసి, తెలంగాణ ఉద్యమం దళిత వ్యతిరేక ఉద్యమంగా వక్రీకరించేందుకు సీమాంధ్ర పత్రికలు కుట్రలు పన్నుతున్నాయి..తద్వారా తెలంగాణ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టించగలమేమోనని పగటికలలు కంటున్నాయి..నిజానికి కోదండరాం చరిత్ర గురించి ఈ పత్రికలు రాయవు..కోదండరాం ఉద్యోగంలో చేరినప్పటినుంచే సగం జీతం పేద దళిత విద్యార్థులకు పంచుతున్నాడు..దీనికి ఈ పత్రికలు ప్రాధాన్యత ఇవ్వవు..పిచ్చి ప్రేలాపనలు, విషబీజాలను మనమెదళ్లలో నాటే సీమాంధ్ర కుట్రపూరిత ద్రోహాన్ని అడ్డుకొందాం..కోదండరాం వెంట నిలబడదాం..తెలంగాణ ఉద్యమాన్ని కాపాడుకుందాం..

No comments:

Post a Comment

Your comment will be published after the approval.